మంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రితో మాట్లాడతా.. పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు అప్పటివరకు మంత్రిగా అధికారం చెలాయించి ఒక్కసారిగా పదవిని కోల్పోయారు. సహజంగానే అధికారం కోల్పోగానే మందీ మార్బలం ఏవీ వెనక ఉండవుకదా. కానీ దాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ఆ ఫ్రస్టేషన్ను తనదగ్గరకు వచ్చేవారిపై చూపిస్తున్నారంటూ ఆయన నియోజకవర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు.
తనదగ్గరకు పనుల కోసం వచ్చేవారెవరూ అధికారుల దగ్గరకు, పక్క జిల్లాల మంత్రుల దగ్గరకు వెళ్లొద్దని హుకుం జారీచేశారు. రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత తానే సీనియర్ మంత్రినని ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని పనులు చేసిపెడతానని ఆ మాజీ మంత్రి చెబుతున్నారు.
అంతేకాదు ఇటీవలే ఒక నగరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తన గోడు చెప్పుకునేందుకు ఒక రైతు రాగా, ఆయన్ని ఎందుకు లోపలికి రానిచ్చావని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకయ్యా అంటూ ఆ ఎస్ఐ పై మండిపడ్డారు. జగనన్న కాలనీ కోసం తన 98 సెంట్ల భూమిని అన్యాయం తీసుకున్నారని, తన సమస్యను పరిష్కరించాలంటూ ఆ సర్వసభ్య సమావేశానికి సూర్యనారాయణ అనే వృద్ధుడు వచ్చారు. ఆయన్ని లోపలికి పంపించినందుకు సదరు మాజీ మంత్రిగారు ఎస్ ఐపై చిందులు వేశారు.
ఎలాంటి పనులనైనా తాను చేయగలనని, ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించగలనని అందరికీ చెబుతున్నారు. వస్తున్నాం కదా అని చులకనగా చూడొద్దంటూ పనిలో పనిగా ప్రజలను కూడా హెచ్చరించారు. ఇదీ సదరు మంత్రిగారి తీరు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తనకు సరైన గౌరవం దక్కడంలేదనే ఫ్రస్టేషన్లో ఆ మాజీ మంత్రిగారున్నారని, అందుకే అలా వ్యవమరిస్తున్నారని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.