మా నాన్నను ఎందుకు మావోయిస్టులు ఎందుకు చంపారో తెలియడంలేదు:కిడారి కుమారుడు నాని
అమరావతి:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపడంపై ఆయన కుమారుడు నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడి గురించి తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి అరకుకుబయలుదేరాడు.
కిడారి సర్వేశ్వరరావుకు భార్య ఇద్దరు కుమారులు ఉండగా వారిలో ఒక కుమారుడైన నాని ఢిల్లీలో చదువుతున్నారు. మావోయిస్టుల నుంచి తమకు హెచ్చరికలు వచ్చినట్లు తెలియదని, తమకు తెలిసి అలాంటి హెచ్చరికలు ఏమీ రాలేదని...తమ తండ్రి కూడా ఈ విషయం ఎప్పుడూ తమవద్ద ప్రస్తావించలేదని నాని చెప్పారు. మావోలు తన తండ్రిని ఎందుకు చంపారో అర్థంకావడం లేదని ఆయన కన్నీరుమున్నీరు అయ్యారు. ఒక మీడియా సంస్థతో ఫోన్ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మరోవైపు అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ దాడి గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జరిగిన దారుణం గురించి, మావోల ఘాతుకం గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మావోయిస్టుల దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను సిఎం ఈ సందర్భంగా కొనియాడారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండించాలన్నారు. ఏజెన్సీ అభివృద్దికి, గిరిజనుల సంక్షేమానికి కిడారి, సివేరి చేసిన కృషి నిరుపమానమని సీఎం ప్రస్తుతించారు.
అలాగే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై మావోయిస్టులు జరిపిన దాడిని మంత్రి నారా లోకేష్ ఖండించారు. మావోయిస్టుల ఘాతుకంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిడారి, సోమ కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.