ఆ విమర్శలు నేను పట్టించుకోను .. రాజధాని రైతుల కోసం మనస్పూర్తిగా గాజులు ఇచ్చా : నారా భువనేశ్వరి
రాజధాని అమరావతి కోసం చేస్తున్న పోరాటం విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గమని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు నివాళులర్పించిన నారా భువనేశ్వరి రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా మరోమారు తన వాణి వినిపించారు.
Recommended Video
అమరావతి కోసం భువనేశ్వరి ఎమోషనల్.. రాజధాని పోరాటం వెనుక అసలు కారణం ఇదే..
ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా భువనేశ్వరి నివాళులు
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 24వ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వరి బసవతారకం ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తాయని చెప్పారు. ఇటీవల ఆమె రాజధాని అమరావతి పరిరక్షణ సమితికి తన గాజులను విరాళంగా ఇవ్వటం రాజకీయ దుమారం రేపింది .
గాజుల విరాళంపై విమర్శలను పట్టించుకోనన్న భువనేశ్వరి
రాజధాని అమరావతి రైతుల పోరాటానికి చివరి వరకు అండగా ఉంటానని చెప్పారు. రైతులకు తన చేతి గాజులు విరాళంగా ఇవ్వటంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు.
ఇక తన గాజుల విరాళాన్ని రాజకీయం చేయవద్దని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి రాజకీయ పార్టీల నాయకులను కోరారు. తన గాజులు వారికి ఇవ్వటం అనేది తనకు మనసులోతుల్లో నుండి కలిగిన భావన అని అందుకే తాను ఇచ్చానని ఆమె అన్నారు.
రాజధాని రైతుల కోసం చివరి వరకు సుపోర్ట్ చేస్తా అని ప్రకటన
భువనేశ్వరి వారు చేసే విమర్శలు తాను అసలు పట్టించుకోనని పేర్కొన్నారు. రాజధాని మార్చడానికి వ్యతిరేకంగా చేసిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు అమరావతి రైతులను కలిశానని ఆమె అన్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలపటం రాజకీయం కాదని మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమానికి తన సంఘీభావం మాత్రమేనని భువనేశ్వరివ్యాఖ్యానించారు . అమరావతి కోసం మహిళలు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదని చెప్పారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్న భువనేశ్వరి రాజకీయాలతో ప్రమేయం లేకుండా రైతుల ఉద్యమానికి తన మద్దతు తెలియజేశానని చెప్పారు.