కులాలను ఓటు బ్యాంకులుగా చూడను...గుండె ధైర్యంతోనే పార్టీ పెట్టా:పవన్ కళ్యాణ్
పశ్చిమ గోదావరి:తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదని, సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా భీమవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ బ్రాహ్మణ సంఘాలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కులాలను ఓటు బ్యాంకుగా చూడనన్నారు. బ్రాహ్మణులకు భీమా అంశం మ్యానిఫెస్టోలో పెట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. వేదాలు, ఆచార వ్యవహారాల మీద తనకు గౌరవం ఉందని ఆయన అన్నారు. గతంలో కొందరు చేసిన తప్పులను బ్రాహ్మణులందరికీ ఆపాదించడం తప్పని పవన్ కళ్యాణ్ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ళ మండలం పెద్దఅమిరం నిర్మలాదేవి ఫంక్షను హల్లో పవన్ బస చేశారు. తొలుత బీసీ సంఘం నాయకులతో పాటు ఆటో యూనియన్ ఇతర సంఘాల నేతలతో జనసేనాని పవన్ సమావేశం అయ్యారు. ఏపీ మొత్తం సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ కుటుంబాల గుప్పిట్లో ఉన్నాయని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆరోపించారు.
బీసీ సంఘాలతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని తెలిపారు. సమాజాన్ని అన్ని రకాలుగా విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. కులాల ఐక్యత అనేది తన ఆశయమని స్పష్టం చేశారు. మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అధికారం తనకు అంతిమలక్ష్యం కాదని, ఇంతమంది అభిమానులు వెంట నడుస్తుంటే సమస్యలపై పోరాటం చేయకపోతే తప్పుచేసిన వాడిని అవుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తీరును పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.