నా మాటలకు కట్టుబడి ఉన్నా, అందుకే చంద్రబాబు నిందలు: శివప్రసాద్
చిత్తూరు: దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్ స్పష్టం చేశారు.
దళితులకు న్యాయం చేయాలని తాను అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. డీకేటీ భూముల రెగ్యులరైజేషన్ హామీ ఏమైంది, బ్యాక్ లాగ్ పోస్టులు ఎందకు భర్తీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఎస్ సి సబ్ ప్లాన్ కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఆయన నిలదీశారు. ఈ ప్రశ్నలు అడిగినందుకే తనపై నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ ప్రశ్నలు లేవనెత్తిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కు దళిత సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి. శివప్రసాద్ పై చంద్రబాబునాయుడు ఆగ్రహంగా ఉండడం పట్ల దళితసంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
గడిచిన మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో దళితులకు టీడీపి ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. ఈ మేరకు ఇదే విషయాన్ని అంబేద్కర్ జయంతి రోజున శివప్రసాద్ చెప్పారని దళిత సంఘాలు గుర్తు చేస్తున్నాయి.