చంద్రబాబు, లోకేష్లకు పదవులు దానం చేశా: పల్లె రఘునాథ్ రెడ్డి ఆసక్తికరం
మైనారిటీ శాఖను సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖను లోకేష్ కు, టూరిజం శాఖను అఖిలప్రియకు, సమాచార శాఖను కాల్వ శ్రీనివాసులకు, ఎన్నారై శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని వ్యాఖ్యానించారు.
పుట్టపర్తి: ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నుంచి తప్పించారన్న అసంతృప్తితోనో.. లేక అధినేత తీరును ఎద్దేవా చేయాలన్న ఉద్దేశంతో కానీ మొత్తానికి తన పదవిని సీఎం చంద్రబాబుకు దానం చేశానని ఆయన పేర్కొనడం గమనార్హం.
అయితే ప్రత్యేకించి చంద్రబాబు ఒక్కరి పేరే కాకుండా.. పలువురు మంత్రుల పేర్లను పల్లె ప్రస్తావించారు. మైనారిటీ శాఖను సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖను లోకేష్ కు, టూరిజం శాఖను అఖిలప్రియకు, సమాచార శాఖను కాల్వ శ్రీనివాసులకు, ఎన్నారై శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని వ్యాఖ్యానించారు.
గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ధర్మశాలలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత ఆదేశానుసారం.. ఆయన కోరిన వెంటనే పదవికి రాజీనామా చేశానని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నగర పంచాయితీ టీడీపీ కన్వీనర్ పదవికి ఆశావహుల పేర్లను సేకరించారు. పార్టీ నిర్ణయం మేరకు కన్వీనర్ పేరును త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి, చైర్మన్ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.