నట్టి కుమార్ ఎవరో తెలియదు: ‘నయీమ్’పై అచ్చెన్నాయుడు
విజయవాడ: టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని అన్నారు.
'నయీమ్తో అచ్చెన్నాయుడికి సంబంధాలు: సినీ నిర్మాతలతో కూడా'
తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసిన గుర్తు లేదని ఆయన చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా విచారణ జరిపించుకోవచ్చని ఆయన సవాలు విసిరారు. నట్టి కుమార్ చెబుతున్న విషయాలు తన దృష్టికి రాలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఏపీలో పలువురు మంత్రులు, అధికారులకు గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్నాయని తాను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని నట్టి కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని షాద్నగర్లో నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని నేర సామ్రాజ్యం గురించిన సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అదేవిధంగా అతనితో సంబంధాలున్నాయంటూ ప్రముఖ రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం. కాగా, సిట్ దర్యాప్తులో అసలు విషయాలు వెలుగుచూడనున్నాయి.