విభజన హామీలు: మన్మోహన్, కేవీపీ ఏమన్నారంటే..?, ఏపీకి మద్దతుగా పలు పార్టీల ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో తాను హామీ ఇచ్చానని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం హోదా హామీని అమలు చేయలేదని, నాడు పార్లమెంట్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నేత డీ రాజా మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోవాలని తమ పార్టీ కోరుకుందని, నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి పదేళ్ల హోదా కావాలని నాడు అరుణ్ జైట్లీ అన్నారని, నేడు ఆర్థిక మంత్రి కాగానే ఆయన ఆ విషయం మర్చిపోయారని, 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతున్నారని దుయ్యబట్టారు.
జేడీయూ ఎంపీ రామచంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. టీడీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, అలాగే, బీహార్ కు కూడా హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ.. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని, చెన్నైలో 25 శాతం మంది తెలుగువాళ్లు ఉన్నారని, ఏపీ కష్టాలు తమకు తెలుసని పేర్కొన్నారు.
అకాలీదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీ ఆర్థికంగా బలమైన రాష్ట్రమని, దార్శనికుడైన చంద్రబాబు విధానాల కారణంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని ప్రశంసించారు. ఇప్పుడు విభజిత ఏపీకి ఇచ్చిన ఆర్థికపరమైన హామీలు అమలు చేయాలని, అలా చేయని పక్షంలో పార్లమెంట్ పై ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.
గొంతెమ్మ కోర్కెలేం కాదు..
ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలవి గొంతెమ్మ కోర్కెలు కాదని, విభజన హామీలను మాత్రమే అమలు చేయాలని గత నాలుగేళ్లుగా కోరుతున్నారని రాంచంద్రరావు అన్నారు.
ఏపీ ప్రజల ఆవేదన ఎవరు వింటున్నారు?
అధికారం చేపట్టిన పార్టీలు పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలను అమలు చేయడంలో తమ రాజకీయ ప్రయోజనాలను వెతుక్కొని ఆ చట్టాల్ని నీరుగారుస్తున్నాయని కేవీపీ విమర్శించారు. ఇలాంటి పరిస్థితితో పార్లమెంట్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. దేశంలో పార్లమెంట్లో చట్టాలు చేసేవారే వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ నమ్మకం సడలితే ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందన్నారు. ఏపీ ప్రజల ఆవేదనను వింటున్నదెవరని కేవీపీ నిలదీశారు.
నమ్మించి మోసం
ఏపీకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టి.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మరికొన్ని హామీలు ఇచ్చారన్నారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలదేనన్నారు. ఎన్నికల సమయంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధికి విభజన చట్టంలో ఇచ్చిన హామీలే సరిపోవని, ఇంకా చేయాలని, తాము అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామంటూ బీజేపీ నేతలు పలు వేదికల్లో ప్రజలను నమ్మించారన్నారు. వారి మాటలను నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలకు ఏం చేశారని కేవీపీ ప్రశ్నించారు.
భయమేస్తోందంటూ టీడీపీ, బీజేపీలపై..
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయారని, ఎన్ని వేదికలపైన నాలుగేళ్లుగా చెప్పినా విన్పించుకోవట్లేదని కేవీపీ ఆవేదన వ్యక్తంచేశారు. గత నాలుగేళ్లుగా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల్లోని పార్టీలు హనీమూన్ చేసుకున్నాయని విమర్శించారు. టీడీపీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది ప్రజలపై ప్రేమతో కాదని, ప్రధాని.. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగానేనని అన్నారు. చట్టంలో చెప్పిన వాటినే అమలు చేయాలని తాము అడుగుతున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసం జట్టుకట్టి.. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని దూరమయ్యారని ఆరోపించారు. ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినహామీల అమలులో కేంద్రం వైపల్యం ఎంత ఉందో.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా అంతే ఉందని కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. కేంద్ర వైఖరితో ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతోందని అన్నారు. మళ్లీ గెలిపిస్తే బీజేపీ, టీడీపీలు ఏం చేస్తాయోనని భయం వేస్తోందనిన అన్నారు.