గాజు గ్లాస్ గుర్తుపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?: రంగంలోకి దిగిన ఫ్యాన్స్.. దుమ్మురేపారు!
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు పార్టీ గుర్తు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జనసేనాని కూడా దీనిపై ట్వీట్ చేశారు.
చదవండి: జనసేన పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ, 2019లో ఏపీ-తెలంగాణ ఈ గుర్తుపైనే పోటీ
తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంపై పార్టీ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మా పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు అని, తనకు చిన్నతనం నుంచి ఈ గాజు గ్లాస్తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, అంతేకాదు మనదేశంలో సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ట్వీట్
ఈ మేరకు పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ఫొటోను ట్వీట్ చేశారు. అలాగే, ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ను గాజు గ్లాస్తో కలిపి ట్వీట్ చేశారు. పవన్ ట్వీట్కు అభిమానులు స్పందిస్తూ... పవన్ సినిమాల్లో టీ తాగుతున్నటువంటి ఫోటోలు, గాజు గ్లాస్ పైన జనసేన గుర్తు వేసిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఓట్ ఫర్ గ్లాస్ థంబ్లర్ అంటూ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు.
అభిమానులు, కార్యకర్తల ఆనందం
గాజు గ్లాసు గుర్తు కేటాయించటంతో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లాసు గుర్తు ఫొటో షేర్ చేసి కామెంట్లు పెద్ద ఎత్తున జత చేస్తున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్, ఇతర హీరోలు వివిధ సందర్భాల్లో గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలను ఉంచారు.
గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు
జనసేన అభిమానులు, కార్యకర్తలు, నేతలు అప్పుడే పలుచోట్ల గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరో అభిమాని చిరంజీవి, అల్లు అర్జున్, బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ.. ఇలా అందరి చేతులో ఉన్న సినిమాల్లోని టీ గ్లాస్ క్లిప్స్తో ఫోటో పెట్టారు. గాజు గ్లాస్ వ్యవస్థలోని పారదర్శకత చూపిస్తుందని పేర్కొంటూ.. ఈ గుర్తుకు ఓటు వేయాలని అప్పుడే చెబుతున్నారు.
చిరంజీవి సినిమాలోని పాట
చిరంజీవి నటించిన మృగరాజు సినిమాలోని ఛాయ్ చటుక్కున తాగరా భాయ్ వీడియోను, ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుల వరకూ అందరి దాహం తీర్చే గ్లాస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రంగంలోకి దిగిన ఫ్యాన్స్
పార్టీ గుర్తు లేదని ఇన్నాళ్లూ బాధ పడుతున్న జనసైనికులు ఇప్పుడు గుర్తు కేటాయించడంతో నేరుగా రంగంలోకి దిగారు. గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తమ వంతుగా సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ గాజు గ్లాస్ గుర్తుపై ఇప్పటికే జనసైనికులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.