నేను చనిపోతే పవనే కారణం-అతని గురించి ప్రపంచానికి తెలియనివి బయటపెడుతా-రేపు పీఎస్లో కేసు : పోసాని
వైసీపీ వర్సెస్ జనసేన మాటల యుద్ధం కాస్త జనసేనాని వర్సెస్ పోసానిగా(Posani Krishna Murali) టర్న్ తీసుకుంది.సీన్లోకి పోసాని ఎంటర్ అవడం... పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేయడంతో వివాదం ముదిరింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషిస్తూ మెసేజ్లు చేస్తున్నారంటూ పోసాని మంగళవారం(సెప్టెంబర్ 28) కూడా మీడియా ముందుకొచ్చారు. తన కుటుంబాన్ని టార్గెట్ చేసినందుకు... పోసాని కూడా పవన్పై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. పోసాని ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే పవన్ ఫ్యాన్స్ లోపలికి చొచ్చుకొచ్చి దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనకు రక్షణ కల్పించి అక్కడి నుంచి తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్పై బుధవారం(సెప్టెంబర్ 29) తాను కేసు పెట్టబోతున్నట్లు పోసాని ప్రకటించారు.
రేపు పవన్ కల్యాణ్పై కేసు పెట్టబోతున్నా : పోసాని
'నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.నాకేమైనా అయితే నా చావుకు కారణం పవన్ కల్యాణే... చిరంజీవి తమ్ముడు.అతని సైకో ఫ్యాన్స్ ద్వారా చంపించడానికి చూస్తున్నాడు.రేపు పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు పెడుతాను.అతని గురించి ప్రపంచానికి ఎంత తెలియదో అవన్నీ తెలియజేస్తా.తెలంగాణలోనే కేసు పెడుతా.ఎక్కడ పెడితే చెల్లుబాటు అవుతుందో అక్కడే పెడుతా.' అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. నిన్నటి పోసాని ప్రెస్ మీట్తో ఆయనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పవన్ ఫ్యాన్స్... ఇవాళ పెట్టిన ప్రెస్మీట్తో ఆయనపై మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు.పోసాని కనిపిస్తే దాడులకు పాల్పడేందుకు యత్నిస్తున్నారు.దీంతో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న టెన్షన్ నెలకొంది.
పరిస్థితి మా చేయి దాటింది : జనసేన
పోసాని ప్రెస్మీట్పై జనసేన నేత శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు ఎవరైతే బూతులతో మెసేజ్లు పెట్టారో... వారిపై కేసులు పెట్టండి.ఇప్పుడు మా చేయి దాటిపోయింది.అసలు అతనికి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడమేంటి.వైసీపీ వాళ్లే ఇదంతా చేయిస్తున్నారు.అసలు ఆ మెసేజ్లు చేసింది వైసీపీ వాళ్లే అయి ఉండొచ్చు కదా. పవన్ రాజకీయ ఎదుగదుల ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారు.పోలీసులు అతనికి ఎందుకింత సపోర్ట్ ఇస్తున్నారో చెప్పాలి .తెలంగాణ నుంచి పోసాని కృష్ణమురళిని బహిష్కరించాలి.ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు ప్యాకేజీ వస్తోంది.ఏపీలో కల్తీ మద్యంపై,రోడ్ల అద్వాన్న స్థితిపై జనసేన ప్రశ్నిస్తోంది.దీంతో పవన్ కల్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే పోసానితో దాడి చేయిస్తున్నారు.' అని శంకర్ ఆరోపించారు.
Recommended Video
పవన్పై పోసాని ఫైర్...
అంతకుముందు పోసాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. 'నీ ఫ్యాన్సుతో నా భార్య పట్ల ప్రశ్నలు వేయించావు కదా... నా భార్యకు అక్రమ సంబంధం అంటగడుతూ మెసేజ్లు పెట్టించావు... మీ కుటుంబ సభ్యులంతా పవిత్రులా.. మా కుటుంబ సభ్యులపై ఏమైనా మాట్లాడవచ్చా... ఒక రాజకీయ నాయకుడి వికృత రూపం నేనిప్పుడు మీకు చూపిస్తున్నా... పంజాబ్ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా... థూ.. నువ్వో బ్రోకర్ గాడివి... ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావు.చిరంజీవి ఎంతో హుందాగా ఉంటారు.నీ ముఖానికి హుందాతనం స్పెల్లింగ్ అయినా తెలుసా. ఎప్పుడైతే మా కుటుంబ సభ్యులను ఇందులోకి లాగారో నాకు బాధ కలిగి... నేను కూడా పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్నాను..' అని పోసాని చెప్పుకొచ్చారు.