చిరంజీవిపై నన్ను ఉపయోగించారు, అనితపై బాబుకు ఇంట్రెస్టా: రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. టిడిపి ఎమ్మెల్యే అనితపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. గతంలో చిరంజీవి, వైయస్ రాజశేఖర రెడ్డి పైన తమను చంద్రబాబు ఉసిగొల్పాడన్నారు.
ఇప్పుడు అనితను తన పైకి ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. ప్రివిలేజ్ కమిటీ ఇష్యూ టిడిపి ఎమ్మెల్యే అనితది అని, కామ సీఎం అనే ఇష్యూ చంద్రబాబుది అన్నారు. తాను చంద్రబాబు ఇష్యూలో తప్పకుండా పోరాడుతానని చెప్పారు. ఇక అనిత విషయంలో.. తనను ఎదుర్కోలేక ఆమెను చంద్రబాబు వాడుకుంటున్నారు.
తాను టిడిపిలో ఉన్నప్పుడు తనను రెచ్చగొట్టి.. వైయస్ రాజశేఖర రెడ్డి పైన మాట్లాడించారన్నారు. తనను చిరంజీవి పైకి కూడా ఉసిగొల్పారన్నారు. వారిద్దర్ని తమతో తిట్టించారని ధ్వజమెత్తారు. తాను తప్పులు ఎత్తి చూపిస్తే టిడిపి బాధపడుతోందన్నారు.
అనితను తాను అనని వ్యాఖ్యలను అన్నట్లుగా చెప్పారన్నారు. తాను ఆ వ్యాఖ్యలు అనలేదని అనిత మనస్సాక్షికి తెలుసునని చెప్పారు. కానీ చంద్రబాబు అనితను పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తాను 18వ తేదీన అనితను తిట్టినట్లుగా చెప్పారని, మరి ఆ తర్వాత మూడు రోజులకు అనిత బయటకు ఎందుకు వచ్చారని చెప్పారు. తాను పీతల సుజాత, బోండ ఉమలను తాను అన్నప్పుడు, తనను వారు అన్నప్పుడు వెంటనే తిప్పి కొట్టామన్నారు.
అనిత అంత ఆలస్యంగా.. పాయింట్ లాగిన రోజా
ఏదైనా మాట అంటే మనం వెంటనే తిప్పికొడతామని, బాధపడతామని, కానీ అనిత మూడు రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చారని పాయింట్ లాగారు. అనిత అంత ఆలస్యంగా ఎందుకు స్పందించారో చెప్పాలన్నారు. అంటే తాను ఆమెను ఘాటుగా వ్యాఖ్యానించలేదనే అర్థమన్నారు.
వారిపై ఏం చర్యలు తీసుకున్నారు
బోండ ఉమ.. తనను రోజా అంటీ అన్నారని, అతని పైన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. 'రోజా ఆంటీ ఐరన్ లెగ్, ఆమె కాలు పెడితే సర్వనాశనం, ఏంటిరా పాతేస్తాను' అని సభలో అన్నారని, వీటిని రాష్ట్రం అంతా చూసిందని, దానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
వీటిపై తాను ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చానని చెప్పారు. కానీ ఇంత వరకు బోండ ఉమను పిలించలేదు, తనకు సారీ చెప్పించలేదన్నారు. నేను అనితలా మహిళను కాదా అని ప్రశ్నించారు. తనకు కుటుంబ సభ్యులు లేరా, మేం బయటకు వెళ్లినప్పుడు మాకు అవమానం జరగదా అని ప్రశ్నించారు.
హోల్డ్ యువర్ టంగ్ అన్నారు
బుచ్చయ్య చౌదరి కూడా తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. రోజా సినిమాల్లో అప్పుడప్పుడు విలన్ వేషాలు వేశారని, జగన్ శాసన సభ్యులను ఇప్పుడు అలా ఎలా తయారు చేస్తున్నారో చూడండని బుచ్చయ్య అన్నారని, ఆ వ్యాఖ్యలను తాను స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
గోరంట్ల మాటలను పట్టించుకోని స్పీకర్ గారు.. తనను మాత్రం హోల్డ్ యువర్ టంగ్ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్తే, ఆయనను ఏమనకుండా తనను అన్నారని, ఇదే సభ వన్ సైడ్ జరుగుతోందనేందుకు నిదర్శనం అన్నారు.
తన ఏడాది సస్పెన్షన్ పైన నేను కోర్టుకు వెళ్తే, అనితను తెరపైకి తీసుకు వచ్చారని, ఆమె చేత ప్రివిలేజ్ కమిటీ ఫిర్యాదు చేయించారన్నారు. తాను ఎన్నో సార్లు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, అనిత ఫిర్యాదును ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు.
అనిత పైన ఇంట్రెస్టా, రోజా పైన కక్షనా
అనిత పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చంద్రబాబుకు, యనమలకు ఎందుకో చెప్పాలన్నారు. అనిత పైన ఇంట్రెస్టా లేక రోజా పైన వారికి కక్షనా చెప్పాలన్నారు.
ప్రివిలేజ్ ముందుకు వెళ్తాను కానీ
తాను ప్రివిలేజ్ కమిటీ ముందుకు వెళ్తానని, సమాధానం చెబుతానని కానీ న్యాయం జరుగుతుందనే భావన లేదన్నారు. కొడాలి నాని సారీ చెప్పినా ఏం జరిగిందో చూశారన్నారు. తాను అనని మాటలకు సారీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అలా చెబితే నేను తప్పు చేసిన దానిని అవుతానన్నారు.
ఒకవేళ సారీ చెప్పినా.. కొడాలి నానిని క్షమించలేదని గుర్తు చేశారు. ఇక్కడ చెప్పిందే ప్రివిలేజ్ ముందు చెబుతానని, వారికి ఆధారాలు చూపిస్తానని చెప్పారు. అనిత విషయంలో తాను మాట్లాడని మాటలు అన్నట్లుగా చెప్పారన్నారు. అధికార పార్టీకి ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారన్నారు. వద్దనుకుంటే ప్రతిపక్షాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేయాలని, ఇక ఓట్లు ఎందుకని ప్రశ్నించారు.
రోజాను భూతంగా
కాల్ మనీ సెక్స్ రాకెట్లో చంద్రబాబు నిందితులతో పాటు కూర్చున్నా వారిని ఏం చేయలేదన్నారు. కానీ రోజాను మాత్రం భూతంగా చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎవరి కులం వారికే గొప్ప
నేను మాట్లాడితే రెడ్డి గర్వమని అంటున్నారని మండిపడ్డారు. కులాలలో ఎక్కువ, తక్కువల గురించి ఎప్పుడూ నేను మాట్లాడనని చెప్పారు. మనం చేసే పనులకు కులాన్ని అడ్డుపెట్టుకోవద్దన్నారు. ఎవరి కులం వారికే గొప్ప అన్నారు.
అనిత, పీతల బలి
చంద్రబాబు అహంకారానికి ఇద్దరు దళిత టిడిపి నేతలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె అనిత, పీతల సుజాతను ఉద్దేశించి బలి అవుతున్నారని వ్యాఖ్యానించారు. మిగతా వాళ్లు కూడా బలి అవుతున్నారన్నారు. టిడిపిలోని అగ్రవర్ణాలు మాత్రం బాగానే ఉన్నారన్నారు. ఇతరుల పైన బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. చంద్రబాబుది ఏ ఎండకు ఆ గొడుకు పడ్డే మనస్తత్వం అన్నారు.