నాకు దోనకొండలో భూముల్లేవు, దమ్ముంటే నిరూపించాలి:ఐవైఆర్ కృష్ణారావు
ప్రకాశం జిల్లాలో తనకు ఎలాంటి భూములు లేవని మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రకటించారు.
హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో తనకు ఎలాంటి భూములు లేవని మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు ప్రకటించారు. తనకు ప్రకాశం జిల్లాలో వందల ఎకరాల్లో భూములున్నాయని నర్సరావుపేట ఎంపీ రాయపాటి చేసిన ఆరోపణలను ఖండించారు.ఈ ఆరోపణలు తప్పని తేలితే రాయపాటిపై ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం నాడు ఐవైఆర్ కృష్ణారావు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏవైనా వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.
ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం టిడిపి నాయకులకు అలవాటైందని ఆయన ధ్వజమెత్తారు. చాలా సీనియర్ పార్లమెంటేరియన్ అయిన రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై సిఎం విచారణ జరపాలన్నారు.
తన మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు ఐవైఆర్. ఏమీ లేకపోయినా తనకు వందల కోట్ల రూపాయాల విలువైన భూములున్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖలో కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరైందికాదన్నారు.
బ్రహ్మణ కార్పోరేషన్ కు రూ. 500 కోట్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టిడిపి హమీ ఇచ్చిందన్నారు. కానీ, ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. గట్టిగా అడిగితేనే ప్రభుత్వం ముద్రగడ పద్మనాభానికి కాపులకు నామమాత్రంగా నిధులను కేటాయించిందన్నారు.