2019లో పోటీ, నా వద్ద అంత డబ్బులేదు: పవన్ కళ్యాణ్, జగన్కు చురక
విజయవాడ: 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, పార్టీని విస్తరించేందుకు తన వద్ద అంత డబ్బు లేదని ఆ పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు చెప్పారు. పార్టీ విస్తరించేందుకు ఆర్థిక స్థోమత లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ రెండు గంటలకు పైగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
ప్రజలకు చెడు జరిగినా, అన్యాయం జరిగినా ఊరుకునేది లేదన్నారు. సమస్యల పైన రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చలతో ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.
తద్వారా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారని భావిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి భూసేకరణ, బాక్సైట్ తవ్వకాలు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై విపక్షాలు టిడిపి, బిజెపిలను నిలదీస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్, కాంగ్రెస్ పార్టీలకు పవన్ కళ్యాణ్ చురకలు అంటించారని అంటున్నారు. చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని, రోడ్డెక్కితే పరిష్కారం కావని పవన్ అన్నారు. అదే సమయంలో హోదా పైన తాను వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నానని, అన్యాయం జరిగితే నిలదీస్తానని చెప్పారు.
కాగా, రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే, అమరావతి శంకుస్థాపనకు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చినట్లు చెప్పారు.
కేవలం రాజధాని ప్రాంతంపైనే కాకుండా మిగిలిన ప్రాంతాలపై కూడా దృష్టి సారించాలని సూచించానన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మిగిలిన భూములను సమీకరిస్తామని చంద్రబాబు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.