టీడీపీలో ఓ మర్యాద, గౌరవం లేవు.. అందుకే బయటికి, ఏదో ఫ్లోలో జగన్ అలా.. : శిల్పా మోహన్ రెడ్డి
తెలుగుదేశం పార్టీలో ఓ మర్యాద, గౌరవం లేవని, తనను పట్టించుకోలేదని, అందుకే తాను బయటికి వచ్చి వైసీపీలో చేరానని నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.
కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఓ మర్యాద, గౌరవం లేవని, తనను పట్టించుకోలేదని నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలోకి దిగుతున్న శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీడీపీలో అలసత్వ ధోరణి, తనకు తక్కువ ప్రాముఖ్యత నివ్వడం.. వంటి కారణాలతో తాను విసిగిపోయానని అన్నారు.
అంతేగానీ, తనకు పదవులు ఇవ్వలేదనో, సీట్లు ఇవ్వలేదనో టీడీపీ నుంచి వైసీపీలోకి రాలేదని మోహన్ రెడ్డి చెప్పారు. నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరినప్పుడు తాను చాలా మధనపడ్డానని, తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారాల్సి వచ్చిందని అన్నారు.
చంద్రబాబు నాయుడు కూడా మొదట్లో ఓ పార్టీలో ఉండి, ఆ తర్వాత మరో పార్టీలోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నంద్యాల బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఏదో ఫ్లో లో వచ్చాయే తప్ప.. కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు.
సీఎం చంద్రబాబును కాల్చేసినా తప్పులేదని జగన్ అన్నారే తప్ప, కాల్చేయమని అనలేదని అన్నారు. అలా అయితే, తాము నిర్మించిన రోడ్లు, తాము ఇస్తున్న పెన్షన్లు, తమ పథకాలను ఉపయోగించుకుంటున్న ప్రజలు టీడీపీకే ఓట్లు వెయ్యాలని ఇటీవల చంద్రబాబునాయుడు అనలేదా? అదీ తప్పుకాదా? అని ప్రశ్నించారు.
ప్రసంగించేటప్పుడు ఏదో ఫ్లోలో అలాంటి వ్యాఖ్యలు వస్తాయని, వాటిని పట్టించుకోకూడదని, రాద్ధాంతం చేయకూడదని శిల్పామోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.