మంత్రిని అవుతాననుకోలేదు, 2019కి అవి పూర్తి, సీఎం ఈ వయసులోను!: లోకేష్
పల్లెటూరికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పదవి తీసుకున్నానని తెలిపారు.
ఒంగోలు: మంగళవారం ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా గ్రామాభివృద్ది కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి లోకేష్ ప్రజలకు వివరించారు.
Recommended Video
పల్లెటూరికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పదవి తీసుకున్నానని తెలిపారు. చిన్న వయసులోనే మంత్రిని అవుతానని అనుకోలేదని, లోటు బడ్జెట్ ఉన్నా తమ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదని అన్నారు.
2019నాటికి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు:
రాష్ట్రంలో ఇప్పటికే 24 వేల కోట్ల రుణమాఫీ చేశామని, త్వరలో మూడో విడత డ్వాక్రా రుణమాఫీ డబ్బు చెల్లిస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులను కలిపి పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో 790 కి.మీ సీసీ రోడ్లు నిర్మించామని, 2019 నాటికి జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు.
2019నాటికి గ్రామాల్లో డంపింగ్ యార్డులు:
2019 నాటికి అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. మార్టూరులో మూడు నెలల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, 2019 నాటికి జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరందిస్తామన్నారు.
ప్రతీ ఇంటికి రూ.10వేలు రావాలనే:
సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన గురించి ఈ సందర్భంగా లోకేష్ ప్రస్తావించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాల్లో పర్యటిస్తున్నారని లోకేష్ అన్నారు. ప్రతి ఇంటికీ నెలకు రూ.10వేల ఆదాయం రావాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు.
67ఏళ్ల వయసులోను యువకుడి లాగే:
67ఏళ్ల వయసులోను సీఎం చంద్రబాబు యువకుల్లాగే కష్టపడి పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం చంద్రబాబు 9రోజుల్లో మూడు దేశాలు తిరిగారన్నారు. రాత్రి 11గంటలకు కూడా సీఎం సమీక్షలు జరుపుతూ ఉంటారన్నారు. మన రాష్ట్రానికి చాలా దారుణమైన ప్రతిపక్ష నేత ఉన్నారన్నారు.