ఆర్ టి సి కి బస్సులివ్వను, వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తా: కేశినేని నాని
ఆర్ టిసి తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడ తన బస్సులను నడపనని విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రకటించారు.బస్సులను తన ఇంటి ముందే పెట్టుకొని ఎంజాయ్ చేస్తానన్నారు.
విజయవాడ: ఆర్ టిసి తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడ తన బస్సులను నడపనని విజయవాడ ఎంపి కేశినేని నాని ప్రకటించారు.బస్సులను తన ఇంటి ముందే పెట్టుకొని ఎంజాయ్ చేస్తానన్నారు.
తాను రాజకీయాల్లోకి వచ్చాక డబ్బులు సంపాదించలేదన్నారు. ట్రావెల్స్ వ్యాపారంలో తొలుత ఉన్నానని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నిబంధనల ప్రకారంగాగానే తన బస్సులను నడిపానని ఆయన చెప్పారు.అయితే కొందరు పనిగట్టుకొని తనపై మాఫియా ముద్ర వేశారని ఆయన ఆరోపించారు.
ఈ వ్యవస్థను మార్చే శక్తి లేకే తాను ట్రావెల్స్ వ్యాపారం నుండి తప్పుకొన్నట్టు ఆయన చెప్పారు.మంచివాడిని దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మంచివాడిని దొంగగా చిత్రీకరిస్తే సమాజానికే చెడు జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను ఏనాడు తప్పు చేయలేదన్నారు కేశినేని నాని. తప్పు అనేది తన డిఎన్ఏలోనే లేదన్నారు.ఈ రెండు రాష్ట్రాలు కాకపోతే ఇంకా దేశంలో మరో 20 రాష్ట్రాలున్నాయి. అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తానని చెప్పారు.మనస్సాక్షితో పనిచేశానని ఆయన చెప్పారు.
తాను ఏనాడు కూడ దొంగ బస్సులు నడపలేదన్నారు. తాను పాయింట్ పాయింట్ ఆపరేషన్ అని 1993 లోనే తిప్పుకోవాలని సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని ఆయన చెప్పారు.
కోర్టు నిర్ణయం మేరకే తిప్పుతున్నానని నాని వెల్లడించారు.రెండేళ్ళ నుండి నష్టాలు వస్తున్నాయని చెప్పారు.అయితే ఇంకా పదేళ్ళ పాటు నష్టాలు వచ్చినా భరించే శక్తి తనకు ఉందన్నారు నాని.