Amaravati: అవును.. అమరావతిలో భూములు కొన్నా: వెనక్కి ఇస్తా: సీమకు రాజధాని వద్దు: టీడీపీ నేత పల్లె..!
అనంతపురం: రాజధాని అమరావతి ప్రాంతంలో తాను భూములు కొనుగోలు చేశానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు. అమరావతి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటును చేస్తున్నట్లు తమ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించే సమయంలోనే తాను రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశానని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కోరితే.. తాను భూములను వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Amaravati: రైతు చేతిపైకి పోలీసు జీప్: మందడంలో మహిళల అరెస్టు.. ఉద్రిక్తత!
కర్నూలుకు రాజధాని అవసరం లేదు..
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనుకోవడం, జ్యుడీషియల్ రాజధానిగా ప్రకటించడం వంటి చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనను విరమించుకోవాలని చెప్పారు.
ఒక సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనే..
ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ కక్షసాధింపు చర్యతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. అమరావతిలో రాజధాని కొనసాగితే.. ఆ ప్రాంతంలో భూములను కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతారని వైఎస్ జగన్ భావిస్తున్నారని అన్నారు. అమరావతిలో భూముల రేట్లు భారీగా పెరగాలని, తాను లబ్ది పొందాలని అనుకోవట్లేదని పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు.
భూములు వెనక్కి ఇస్తా..
అవసరమైతే భూములను వెనక్కి ఇచ్చేస్తానని, అమరావతిని మాత్రం రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కోపంతో జగన్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అమరావతి రైతులకు నష్టాన్ని కలిగించే ఆలోచన ఏమాత్రం మంచిది కాదని పల్లె రఘునాథ రెడ్డి హితవు పలికారు. రైతన్న కన్నీరు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని..
ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్ లక్షలాది ఎకరాలను కొనుగోలు చేశారని, ముందు వాటి గురించి వెల్లడించాలని చెప్పారు. విశాఖపట్నంలో విజయ సాయిరెడ్డి, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని, అందుకే అక్కడికి రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లావాసులకు విశాఖపట్నం కంటే న్యూఢిలీ దగ్గర అవుతుందని ఎద్దేవా చేశారు.