ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఏపీ పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తమకు కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అన్నారు. తాను దర్యాప్తు నివేదికలు తెప్పించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
అంతేగాక, కోడెల తనకు మంచి మిత్రుడని కిషన్ రెడ్డి తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నారనే విషయం నమ్మలేకుండా ఉందని, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే తాను సూచించానని తెలిపారు.
ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడే వ్యక్తి.. ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడంపై తమకు అనుమానాలున్నాయని పలువురు టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల డీజీపీల నుంచి సమగ్ర నివేదిక తెప్పించుకుంటానని తెలిపారు.
టీడీపీ నేతల వల్లే కోడెల ఆత్మహత్య..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవమానించడం వల్లే కోడెల శివప్రసాదరావు మరణించాడని వైసీసీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా ఆరోపించారు. కొద్ది రోజులుగా చంద్రబాబు.. శివప్రసాదరావుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ఆ అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కోడెలను వర్ల రామయ్య దూషించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.