జనసేన బలోపేతంపై 5గం.ల చర్చ, జేపీ విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన భేటీలో జిల్లాల కమిటీల నియామకం, పార్టీని విస్తృతపరచడం, మేనిఫెస్టో రూపకల్పనలపై చర్చించారు. మేథావులు, వివిధ వర్గాలవారు, గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న వారితో చర్చించారు.
పవన్ కళ్యాణ్ను జేపీ ఏమన్నారంటే..
Recommended Video
వారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో కమిటీల నియామకానికి ప్రతి జిల్లాకు ఒక బందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాల్లో జిల్లాల విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో జిల్లాకు 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రెసిడెంట్ టీంగా వ్యవహరిస్తారు.
సలహాలు, సూచనలు సేకరిస్తున్న పవన్
వీరు జనసేన ముఖ్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి ఎంపికలు చేస్తారు. వివిధ రంగాలలోని ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవాతత్పరులు, అధికార, అనధికార ప్రముఖులను కలిసి కమిటీల ఏర్పాటులో వారి సలహాలు, సూచనలను సేకరిస్తున్నారు.
కమిటీల నియామకాలు ఇలా
ప్రజామోదం పొందిన వ్యక్తులను కమిటీలో నియమించే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు జిల్లా ఇంచార్జులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలలో విస్తృతంగా పర్యటనలు జరిపిన అనంతరం కమిటీలలో నియామకానికి అర్హతలు గలవారిని ప్రెసిడెంట్ టీమ్ గుర్తించి కేంద్ర కార్యాలయానికి ఒక నివేదికతో పాటు జాబితా సమర్పిస్తుంది. ఈ జాబితా ఆధారంగా ప్రెసిడెంట్ సెంట్రల్ టీం కమిటీలకు రూపకల్పన చేసి పార్టీ అధ్యక్షుడి ఆమోదానికి పంపుతుంది. తూర్పు గోదావరి, అనంతపురం టీంలు ఇప్పటికే కమిటీల నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి.
ఎలా ఉండాలి... భేటీ ఇలా
శుక్రవారం విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు జనసేన కార్యాలయంలో పవన్తో భేటీ అయ్యారు. పార్టీ విధి విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పార్టీ మేనిపెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలి అన్న అంశాలపైచర్చించారు.
జేపీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందన
ఇదిలా ఉండగా, జేఎఫ్సీని మొదట పట్టించుకున్నప్పటికీ ఆ తర్వాత పట్టించుకోలేదన్న జేపీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విభజన హామీలపై నిజనిర్ధారణకు మరో స్వతంత్ర కమిటీ వేయాలన్న జేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. విభజన హామీలు, హోదా విషయమై స్వతంత్ర కమిటీని నియమించి జేఎఫ్సీ స్పిరిట్ను ముందుకు తీసుకు వెళ్లాలన్న జేపీని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.