స్నేహితుని ప్రాణం కోసమే తనిష్క్ దొంగతనం: ఆనంద్
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన తనిష్క్ ఆభరణాల షాపు దొంగతనంలో ప్రధాన నిందితుడు గంటినపాటి ఆనంద్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పారిపోయిన ఆనంద్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి వెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళగిరిలోనే ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు. తానే దొంగతనం చేశానని ఇటీవల కిరణ్ అనే మరో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే.
కాగా అంతకుముందు తనిష్క్ షాపులో భారీ చోరీకి పాల్పడిన ప్రధాన నిందితుడు ఆనంద్ ఓ వార్త ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు. తన స్నేహితుడు కిరణ్ కోసమే తనిష్క్ ఆభరణాల షాపులో చోరీకి పాల్పడ్డట్లు వెల్లడించాడు. దొంగతనం చేయడానికి వెనుక గల కారణాలను ఆనంద్ వివరించాడు.
తన స్నేహితుడు కిరణ్ హైదరాబాద్ నగరానికి 2013లో వచ్చాడని తెలిపాడు. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగం సంపాదించాలనేది కిరణ్ కల అని తెలిపాడు. ఆ కల నెరవేరాలంటే అందుకు సంబంధించిన ఓ కోర్సు చేయాలని, దానికి అధిక మొత్తంలో డబ్బు అవసరమవుతుందని తనకు కిరణ్ తెలిపాడని ఆనంద్ చెప్పాడు. అందుకోసం దొంగతనం ఒక్కటే మార్గమని కిరణ్ సూచించాడని చెప్పుకొచ్చాడు.
దొంగతనం చేయడం తప్పని తాను చెప్పినప్పటికీ, తన వయసు అయిపోతుందనీ, ఇంకా ఇలాగే ఉంటే ఉద్యోగం రాదనీ కిరణ్ తెలిపాడని వెల్లడించాడు. ఒకవేళ దొంగతనానికి ఒప్పుకోనట్లయితే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం వల్లనే విధి లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడ్డట్లు నిందితుడు ఆనంద్ వెల్లడించాడు.
తనిష్క్ గోడకు కేవలం సుత్తి, స్క్రూ డ్రైవర్ సహాయంతోనే కన్నం వేశామనీ, ఇంతకుముందు ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చేయలేదని వివరించాడు. కిరణ్ తన చదువు కోసం తన తల్లిని డబ్బు అడిగితే తనకు అంత స్థోమత లేదనీ, దేంట్లోనయినా పడి చావమని తిట్టిందని వెల్లడించాడు. అందువల్లనే తన స్నేహితుడు కోసం ఇలా దొంగతనం చేశానని వివరించాడు. తనిష్క్ ఆభరణాల షాపులో చోరీకి గురైన 15 కిలో బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.