అలా మరణించాలనుకుంటున్నా, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలొచ్చే సలహాలివ్వండి: పవన్ కళ్యాణ్
అమరావతి: పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదని, పార్టీ పదవులు, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయన్నారు.
పేరు, ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి వాటిని విజయవంతంగా నడపలేరని చెప్పారు. బాధ్యత, సమాజం కోసం పని చేయాలన్న తపన, ఓపిక, సహనం అవసరమన్నారు. డబ్బు పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. సేవ చేద్దామనే ఆలోచన ఉన్నవారు కనుమరుగు అవుతున్నారన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలివ్వండి
సార్వత్రిక ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు వచ్చేలా సలహాలు ఇవ్వాలని ఆయన కార్యకర్తలు, అభిమానులు, నేతలను కోరారు. వ్యక్తిగతంగా 10వేల ఓట్లు పొందగల సామర్థ్యం ఉన్నవారిని పార్టీ తప్పకుండా హక్కున చేర్చుకుంటుందని చెప్పారు.
చిరంజీవి పీఆర్పీ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని
తన సోదరుడు చిరంజీవి 2009లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సమయంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీని తీర్చిదిద్దుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మనది కులాలతో ముడివడిన సమాజమని, అన్ని కులాలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. కులాల ప్రభావం అధికంగా ఉండే యూపీలో కూడా కుల రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయని చెప్పారు. నిస్వార్థంగా పనిచేస్తే పదవులు అవే వస్తాయని చెప్పారు. ఎవరు కూడా రాజకీయాల్లోకి రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరని చెప్పారు.
నేను అలా చనిపోవాలనుకుంటున్నా
కులం పేరు చెప్పి వ్యక్తులు బాగుపడుతున్నారు తప్ప కులాలు లాభపడటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ప్రవాహం లాంటివాడిని అని చెప్పారు. తనను ఎవరూ ఆపలేరన్నారు. ఒకటి రెండు కులాలను అడ్డం పెట్టుకొని ఎవరు కూడా విజయం సాధించలేరని చెప్పారు. బాధ్యత, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. చిన్ననాటి నుంచే తాను ఈ లక్షణాలను అలవర్చుకున్నానని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పుట్టిన ప్రతి ఒక్కరు రెండు రకాలుగా మనుగడ సాగించవచ్చునని పవన్ చెప్పారు. ఒకటి తనకు ఇష్టమైన రీతిలో తిని తిరిగి మరణించడం, రెండోది మనతోటి వారికి సాయం చేస్తూ సంఘానికి ఉపయోగపడుతూ సేవ చేస్తూ మరణించడం అని చెప్పారు. ఇందులో రెండోది తనకు ఇష్టమని చెప్పారు.