తెలుగు ప్రజలకు సేవ చేయాలనుంది: తిరుమలలో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్
తిరుపతి: ప్రముఖ సినీనటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తనపై కొందరు రాజకీయ కుట్రలు చేశారని ఆరోపించారు. ఐదుసార్లు ఎంపీ అయిన వ్యక్తి.. తనపై ఈ కుట్రలు చేశారన్నారు. ఎన్నికైన రెండేళ్ల తర్వాత కేసు పెట్టారని ఆరోపించారు.
తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు, సహాయం చేస్తానని నవనీత్ కౌర్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట
కాగా, సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో నవనీత్ కౌర్ కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆమె ఈ ఎస్సీ సర్టిఫికెట్ను సంపాదించారని, అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నామని బాంబే హైకోర్టు అంతకుముందు ఉత్తర్వులు జారీ చేయగా వాటిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించి ఉంటే ఈమె తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉండేది. కానీ, సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడంతో ఎంపీగా కొనసాగే అవకాశం లభించింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ సుబ్రమణియన్, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు.