మళ్లీ మళ్లీ మా ఊరొస్తా: మహేష్, రంగుల రోడ్డు బావుండదు.. ప్రిన్స్ చమత్కారం
బుర్రిపాలెం: తాను బుర్రిపాలెం గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం నాడు చెప్పారు. ఆయన తన బావ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇతరులతో కలిసి తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు బుర్రిపాలెం గ్రామం రావడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన తండ్రి, తాత, బాబాయ్ ఊరికి చేశారని, నేను వారి దారిలో నడుస్తున్నానని చెప్పారు. మా ఊరిని దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు.
నేను శ్రీమంతుడు సినిమా చేస్తున్న సమయంలో తన బావ గల్లా జయదేవ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పారన్నారు. తాను చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఓ ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వచ్చిందేనని చెప్పారు. తన బావ దత్తత తీసుకుంటే బాగుంటుందని చెప్పారన్నారు.
తాను గ్రామంలో విద్య, వైద్య పైన ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు. ఇకపై ఈ గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. ఆంధ్రా ఆసుపత్రి ద్వారా ప్రతి ఇంటికి ఆరోగ్య కార్డు పంపిణీ చేశామని చెప్పారు. సిద్ధార్థ కాలేజీ ద్వారా యంగ్ ఇండియా గ్రూపా చాలా సహకరిస్తోందన్నారు.
ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మహేష్ బాబు... రంగుల రోడ్లు వేస్తే బాగుండదు కదా అని సరదాగా సమాధానం చెప్పారు. తాను రోడ్లకు రంగులు వేయించి వెళ్లిపోనని, విద్య, వైద్యంపై దృష్టి సారిస్తానని చెప్పారు.
వచ్చే వారం సిద్ధాపూర్లో పర్యటిస్తా
తెలంగాణణలోని మహబూబ్ నగర్ జిల్లాలో దత్తత తీసుకున్న సిద్ధాపూర్ గ్రామం గురించి పలువురు విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ... వచ్చే వారం సిద్ధాపూర్ గ్రామంలో పర్యటిస్తానని చెప్పారు. అక్కడ ఇప్పటికే తన సతీమణి నమ్రతా శిరోద్కర్ పర్యటించారని చెప్పారు.
బాల్కనీలో నుంచి అభివాదం చేసిన మహేష్
అంతకుముందు, బుర్రిపాలెంలోని తమ తాతయ్య భవనంలో ఉన్న మహేష్ బాబు బాల్కనీలోకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మహేష్ను చూసేందుకు అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
అంతకుముందు, ఎంపీ గల్లా జయదేవ్, అధికారులు, బుర్రిపాలెం గ్రామపెద్దలు, తదితరులతో గ్రామ సమస్యలతో పాటు పలు విషయాలను మహేష్ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ టాప్ జీప్లో గ్రామంలోని వీధుల్లో మహేష్ బాబు పర్యటించినట్లుగా తెలుస్తోంది.