అఖిలతో విబేధాలు నిజమే, ఆళ్ళగడ్డలో పోటీ, పార్టీ కోసమే: ఏవీ సుబ్బారెడ్డి సంచలనం
Recommended Video
అమరావతి:కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. మంత్రి అఖిలప్రియతో తనకు విబేధాలున్న మాట వాస్తవవమేనని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పుట్టిన ఊరిని తాను వదులుకోనని ఆళ్ళగడ్డలో అడుగుపెడతానని ఏవీ సుబ్బారెడ్డి కుండబద్దలు కొట్టారు.
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య అంతర్గతంగా ఉన్న విబేధాలు తాజాగా బహిర్గతమమయ్యాయి. ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి భూమా అఖిలప్రియకు మధ్య మాటల తూటాలు చోటు చేసుకొంటున్నాయి. మంత్రి అఖిలప్రియపై టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలోనే మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విబేధాలను పార్టీ నాయకత్వం సర్దిచెప్పింది. దీంతో ఆ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన భూమా బ్రహ్మనందరెడ్డి విజయం కోసం ఏవీ సుబ్బారెడ్డి కృషి చేశారు.
ఆళ్ళగడ్డను వదలను
కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉండేవాడు. భూమా నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం మరణించారు. అయితే ఇటీవల జరిగిన ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి భూమా కుటుంబసభ్యులు ఏవీ సుబ్బారెడ్డిని ఆహ్వనించలేదు. ఆ వర్ధంతి సభలోనే పరోక్షంగా ఏవీపై మంత్రి అఖిలప్రియ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆళ్ళగడ్డలో ఏవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎవరూ కూడ వెళ్ళకూడదని మంత్రి అఖిలప్రియి ఇచ్చిన ఆదేశాలను కొందరు పార్టీ నేతలు ధిక్కరించారు. అయితే ఈ విబేధాలు ముదిరిపాకానపడ్డాయి. ఆళ్ళగడ్డను తాను వదిలే ప్రసక్తే లేదని ఏవీ సుబ్బారెడ్డి తాజాగా స్పష్టం చేశారు. కన్నతల్లిని, పుట్టిన ఊరును తాను వదలబోనని ప్రకటించారు. తాను కూడ ఆళ్ళగడ్డలోనే పుట్టానని ఆయన తేల్చి చెప్పారు.
ఆళ్ళగడ్డలో టిడిపి జెండా ఎగురవేస్తా
ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి జెండాను ఎగురవేస్తానని టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇందుకోసం తాను ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో జోక్యం చేసుకొంటానని ఆయన తేల్చి చెప్పారు. ఆళ్ళగడ్డలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసమే తాను పని చేస్తున్నానని ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.పార్టీ కోసం ఆళ్ళగడ్డలో ఖచ్చితంగా అడుగుపెడతానని సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు.
అఖిలతో విబేధాలున్నాయి
ఏపీ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో తనకు విబేధాలున్నాయని టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కొంత కాలంగా మంత్రి అఖిలప్రియ తనను కలుపుకొని పోవడం లేదనే అసంతృప్తితో ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారు.తనను ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి పక్కన పెట్టారనే అభిప్రాయంతో ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలకు ముందు చోటు చేసుకొన్న పరిణామాలు కూడ మంత్రి అఖిలప్రియకు ఏవీ సుబ్బారెడ్డి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమైందని అఖిలప్రియ సన్నిహితులు అభిప్రాయంతో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి పోటీ
వచ్చే ఎన్నికల్లో తాను ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. పార్టీలో తనకు న్యాయం జరుగుందనే నమ్మకం ఉందన్నారు. తాను పార్టీ కోసమే పనిచేస్తున్నట్టు చెప్పారు. మంత్రి అఖిలప్రియ కోసం తాను పనిచేయడం లేదన్నారు. పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని కూడ ఆయన ప్రకటించారు.