2019లో వెంకటగిరి నుండి పోటీ చేస్తా, ఏ పార్టీ నుండో తెలుసా?: నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి
నెల్లూరు: 2019 ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు.
త్వరలోనే కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకొంటానని ఆయన ప్రకటించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని రెండు నెలల్లో ప్రకటించనున్నట్టు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాంకుమార్ రెడ్డి ఉండేవాడు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు.
అయితే బిజెపిలో కూడ అంతగా క్రియాశీలకంగా రాంకుమార్ రెడ్డి లేరు.ఎన్నికలు దగ్గరపడుతున్నందున త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నారు. అయితే రాంకుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.