ఏం చెప్పాలో...చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతా:అలకపై మంత్రి గంటా స్పందన
విశాఖపట్టణం:అలకతో పార్టీలో అలజడి సృష్టించిన మంత్రి గంటా శ్రీనివాసరావు బెట్టు వీడి సిఎం చంద్రబాబు పర్యటనలో పాల్గొనడంతో ముఖ్యమంత్రితో సహా పార్టీ ముఖ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Recommended Video
మంత్రి గంటా అలకపాన్పు వీడటంలో హోం మంత్రి చినరాజప్ప కీలక పాత్ర పోషించారు. దీంతో గంటా సిఎం పర్యటనలో పాల్గొంటారా లేదా అనే సస్పెన్స్ కు తెరపడింది. మరోవైపు ముఖ్యమంత్రితో పర్యటన సమయంలో మంత్రి గంటా తన మనస్థాపానికి కారణాల గురించి ఆయనకు రెండు సందర్భాల్లో వివరించినట్లు తెలిసింది. అనంతరం మంత్రి గంటా మీడియాతో తన అలక విషయమై మాట్లాడుతూ 'ఏం చెప్పాలో.. ఎప్పుడు చెప్పాలో నాకో ఆలోచన ఉంది.. చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతా'..అని వ్యాఖ్యానించడం గమనార్హం.
హో మంత్రి...చొరవ
అలకతో టిడిపిలో ప్రకంపనలు రేపిన మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రసన్నం చేసుకునే బాధ్యతన ఆ పార్టీ అధిష్టానం హోం మంత్రి చినరాజప్పపై పెట్టింది. దీంతో ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో మంత్రి గంటా అలక కారణంగా ఆ పర్యటనలో పాల్గోని పక్షంలో చినరాజప్పపై ఆ ప్రభావం ఎంతో కొంత పడుండేది. అయితే హో మంత్రి చిన రాజప్ప పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నెరవేర్చగలిగారు. ఫలితంగా సిఎం చంద్రబాబు పర్యటనలో మంత్రి గంటా కనిపించారు.
చినరాజప్ప...ఏం చేశారంటే?
గురువారం ఉదయమే గంటా నివాసానికెళ్లిన చినరాజప్ప అక్కడ సిఎం పర్యటనకు ససేమిరా అంటున్న మంత్రి గంటాకు అనేక విధాల నచ్చచెప్పారు. సిఎం చంద్రబాబు మంత్రి గంటా గురించి చెప్పిన విషయాలను ఆయనకు తెలియచేశారు. అన్నివిధాలా ఆయనతో మాట్లాడి ఎట్టకేలకు మంత్రి గంటా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో పాల్గొనేలా ఒప్పించగలిగారు. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి గంటాను వెంటబెట్టుకొని ఆయనతో కలిసి విమానాశ్రయానికి వెళ్లడంతో పాటు వీరిరువురూ కలసి సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు.
రెండు సందర్భాల్లో...వివరణ
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి గంటాను తన వాహనంలో ఎక్కించుకుని ఆ ప్రయాణంలో సుమారు 15 నిమిషాలు...ఆ తరువాత మళ్లీ మధ్యాహ్న భోజన సమయంలో మరో 20 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గంటా గత కొన్నేళ్లుగా తనకుపార్టీలో, ప్రభుత్వంలో ఎదురైన...ఎదురవుతున్న చేదు అనుభవాలు అన్నింటి గురించి సిఎంకు ఏకరువు పెట్టినట్లు తెలిసింది. విశాఖలో ఏం జరిగినా వాటిని తనకే ముడిపెట్టడం, ప్రతి విషయంలో తననే టార్గెట్ చేయడం ఇబ్బందికరంగా మారిందని గంటా వాపోయినట్లు తెలిసింది. అసలు తాను కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నప్పుడే తన మెంటార్ చంద్రబాబు అని చెప్పిన విషయం గంటా గుర్తు చేశారని తెలుస్తోంది.
గంటా స్పందన...సిఎం ప్రతిస్పందన
ఒకానొక దశలో మంత్రి గంటా సిఎంతో తాము ప్రయాణించే కారులోనే పక్కనే ఉన్న కలెక్టరును చూపుతూ విశాఖలో తాను ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టిందీ, లేనిదీ ఆయనను అడిగి తెలుసుకోవచ్చని ఆవేదనతో సీఎంకు సూచించారని తెలిసింది. భీమిలిలో తనకు ప్రత్యర్థిగా వైసిపికి కౌన్సిలర్ స్థాయి వ్యక్తి బాధ్యుడిగా ఉన్నారని, ఈ సారీ తాను అక్కడి నుంచే పోటీ చేస్తే కనీసం 50వేల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంటే...తాను ఓడిపోతానని అనడం ఏమిటని మంత్రి గంటా వాపోయినట్లు సమాచారం. దీనిపై ప్రతిస్పందించిన చంద్రబాబు మంత్రి గంటాకు సర్ధిచెబుతూ...రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమని, పట్టించుకోవద్దని సూచించినట్లు తెలిసింది.
భీమిలి నుంచే...గంటా పోటీ
అంతకు ముందు గంటాతో చర్చల అనంతరం హోం మంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మంత్రి గంటా ప్రస్తుతం ఆయన నియోజకవర్గం అయిన భీమిలి నుంచే ఎమ్మెల్యేగా టిడిపి నుంచి పోటీ చేస్తారని, ఇందులో మరోమాటకు తావులేదని స్ఫష్టం చేశారు. అసలు భీమిలి నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉనికే లేదని...అలాంటప్పుడు తాను అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఏమిటని మంత్రి గంటా తనతో అన్నారని చినరాజప్ప చెప్పారు. తాను భీమిలి నుంచే పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని మంత్రి గంటా ధైర్యంగా చెబుతున్నారని చినరాజప్ప తెలిపారు.
అప్పుడు చెబుతా:మంత్రి గంటా
తన అలకకు కారణాలు, పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై మంత్రి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు వాటిపై స్పందించేందుకు నిరాకరిస్తూ...ఈ విషయాలపై...ఏం చెప్పాలో...ఎప్పుడు చెప్పాలో...ఎలా చెప్పాలో తనకో ఆలోచన ఉందని...అది చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతానని మంత్రి గంటా వ్యాఖ్యానించారు.