ఓటుకు రూ.5వేలు ఇవ్వగలను, ఎవరు డబ్బిచ్చినా..: చంద్రబాబు సంచలనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఓటుకు రూ. 5వేలు ఇవ్వగలనని అన్నారు. కానీ ఎందుకివ్వాలని ప్రశ్నించారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలుచుకుంటే ఓటుకు రూ. 5వేలు ఇవ్వగలనని అన్నారు. కానీ ఎందుకివ్వాలని ప్రశ్నించారు. తన వల్ల లాభం పొందిన వాళ్లంతా తమకే ఓటేయాలని అన్నారు.
ఎవరు డబ్బిచ్చినా..
అంతేగాక, ఎవరు డబ్బిచ్చినా తనకే ఓటేయాలని చంద్రబాబునాయుడు చెప్పారు. నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
నమస్కారం పెడతా..
కాగా, అదే సమయంలో సీఎంను కలిసేందుకు ప్రజలు అక్కడకు చేరుకుని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అయితే, సమస్యలు చెప్పడం కాదు, వినండంటూ చంద్రబాబు మాట్లాడారు. ‘మీకు ఓటుకు ఓటుకు ఐదు వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే నేను 5లక్షల చొప్పున వసూలు చేయాలి. నాకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. నేనంటే మీకు ఇష్టం లేకపోతే.. నేను మీకెందుకు పనులు చేయాలి' అని ప్రశ్నించారు.
నాకు ఓటేయకుంటే ఎట్లా..?
‘నేనిచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు. నేనిచ్చిన రేషన్ తీసుకుంటున్నారు. నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు. నాకు ఓటేయకుంటే ఎట్లా? నా పరిపాలన బాగా లేదంటే నేనేమీ తీసుకోను. నాకేమీ వద్దు' అని చంద్రబాబు అన్నారు. పదేళ్ల కిందే నేను అధికారంలో ఉంటే రాష్ట్రం ఎక్కడికో పోయేదని అన్నారు.
నష్టం జరిగింది....
వెయ్యి పెన్షన్ ఇస్తున్నాం, రుణమాఫీ చేశామని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ ఇప్పటికీ పెత్తందారీ వ్యవస్థే ఉందని, సీమ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నాయకులను తీసుకొచ్చానని తెలిపారు. తమ కంటే తమ తర్వాతితరం నాయకులు మరింత పాజిటివ్గా ఉన్నారని చెప్పారు. రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చామని, కానీ, తమకు నాయకులు, ఎన్నికల్లో గెలుపు కావాలన్నారు. తాము కొన్ని విషయాల్లో రాజీ పడటం వల్ల టీడీపీలో కొంతమందికి నష్టం జరిగిందని చెప్పారు.