జేసీ మనసులో మాట: బీజేపీలో చేరతా..? కానీ కండీషన్, జాతీయ పార్టీలతోనే రాష్ట్రాల ..
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు టీడీపీలో ఉంటానంటునే.. బీజేపీలో చేరే అవకాశం కూడా ఉందని సిగ్నల్స్ ఇచ్చారు. కానీ అందుకు అంటూ.. షరతు విధించారు. ఇవాళ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్తో జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఇష్యూ జరిగిన మరుసటి రోజే బీజేపీ నేతను జేసీ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కిషన్ రెడ్డితో భేటీ..?
సత్యకుమార్తో వివిధ అంశాలపై జేసీ దివాకర్ రెడ్డి చర్చించారు. అమరావతిలోనే ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డిని సోమవారం జేసీ భేటీ అయ్యే అవకాశం ఉంది. వరసగా బీజేపీ నేతలతో జేసీ మీటవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు తాను టీడీపీలోనే ఉంటానని జేసీ స్పష్టంచేశారు. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం జాతీయ పార్టీలే కీలకమని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పీవోకేనే ఆక్రమిస్తే..
తాను పార్టీ మారబోనని.. ఒకవేళ పాక్ ఆక్రమిత కశ్మీర్ను ప్రధాని నరేంద్ర మోడీ స్వాధీనం చేసుకుంటే.. బీజేపీలో చేరతానని ప్రకటించారు. 70 ఏళ్లలో కానీ కశ్మీర్ విభజన చేసిన మోడీ-అమిత్ షా ద్వయం.. పీవోకే కూడా తీసుకొస్తే బీజేపీలో చేరే తొలి వ్యక్తిని తానేనని చెప్పారు. అప్పుడు జాతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిపోతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు ఆశించినస్థాయిలో ఆదరణ ఉండదని అభిప్రాయపడ్డారు.
హైటెన్షన్
శనివారం అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తానని చేసిన కామెంట్లపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం వెళ్లారు. అయితే పోలీసులు ష్యూరిటీ అంటూ పీఎస్లోనే ఉంచిన సంగతి తెలిసిందే.
8 గంటలు పీఎస్లోనే..
దాదాపు 8 గంటలపాటు కూర్చొబెట్టడంతో తాడిపత్రి నుంచి జేసీ అనుచరులు రావడం, ఒకరు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొనే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత జేసీనీ పోలీసులు వదిలేయడంతో.. తానేమన్నా దేశద్రోహినా అంటూ విరుచుకుపడ్డారు.