అందుకే వైసిపిలోకి: జగన్తో మల్లాది విష్ణు భేటీ, ఐవైఆర్ కృష్ణారావుపై..
నవ్యాంధ్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, అందుకే తాను వైసిపిలో చేరుతున్నానని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు చెప్పారు
విజయవాడ: ప్రస్తుత పరిస్థితుల్లో నవ్యాంధ్రకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, అందుకే తాను వైసిపిలో చేరుతున్నానని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు చెప్పారు.
చదవండి: వైసిపిలోకి మల్లాది విష్ణు, అందుకే: దీటుగా జగన్ 'ఆపరేషన్'
ఆయన హైదరాబాదులో జగన్తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ సీఎం కావాలనే ఉద్దేశ్యంతోనే తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహించి జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతానని చెప్పారు.
ఏపీలో అరాచక పాలనను అంతమొందించి జగన్ సీఎం కావాల్సిన చారిత్రక అవసరం ఉందని చెప్పారు. అందుకే తాను వైసిపిలో చేరుతున్నానని చెప్పారు. అంతేకాని సీటు తనకు సీటు ఇస్తారని ఆ పార్టీలో చేరడం లేదన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అందరితో కలిసి తాను కూడా పని చేస్తానని చెప్పారు. ఐవైఆర్ కృష్ణారావు సంఘటన వల్లే వైసిపిలో చేరుతున్నారా.. అని విలేకరులు ప్రశ్నించగా, దానికి, తన చేరికకు సంబంధం లేదన్నారు.
కానీ ఐవైఆర్ కృష్ణారావు పట్ల ఏపీ ప్రభుత్వం తీరును ఖండిస్తున్నానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డితో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. వైసిపిలో చేరిక ద్వారా తిరిగి కుటుంబంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు.