నా నియోజకవర్గంలో వేలుపెడితే రౌద్ర శంకరుడినే: రాజయ్య వార్నింగ్
వరంగల్: తన నియోజకవర్గమైన స్టేషన్ఘన్పూర్ విషయంలో ఏ ఒక్కరూ వేలు పెట్టినా సహించబోనని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ డిప్యూడీ సిఎం రాజయ్య హెచ్చరించారు. తాను భోళాశంకరుడిని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరు వేలు పెట్టినా రౌద్ర శంకరుడినవుతానని అన్నారు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్లో ఉన్న సమయంలో అధికార పార్టీని, ఎమ్మెల్యే పదవిని తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజయ్య తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత : కడియం
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు తెలంగాణ జాతిపత అని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను వరంగల్ జిల్లా టిఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. పేదల సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్ను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ అని చెప్పారు.