కిరణ్: ఈ మంత్రులకి ఆహ్వానంలేదు, కొందర్ని పిలిచినా..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశానికి తనను కూడా పిలువలేదని మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఆదివారం అన్నారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో కిరణ్తో చర్చించిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సీమాంధ్ర మంత్రులు స్పందించారు. ఆ సమావేశానికి హాజరు కాని వారు భిన్నంగా స్పందించారు.
వారానికి రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసి టీ, కాఫీ, బజ్జీలతో సరిపెట్టి చేతులు దులుపుకొని బయటికి రావటం సమంజసం కాదని డొక్కా వ్యాఖ్యానించారు. ఏడు కోట్ల మంది ప్రజలు వీధుల్లో ఉండి ఉద్యమిస్తుంటే సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని అన్నారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించడానికి కృషి చేయాలని ఆయన కోరారు.
సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో కిరణ్ ఆదివారం నిర్వహించిన సమాశానికి తనను పిలవలేదని మంత్రి డొక్కా చెప్పారు. దీనికి గల కారణమేంటో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అయితే సిఎంతో తాను సన్నిహితంగానే ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే ఎంపీల సస్పెన్షన్ల విషయంలో కేంద్రం పునరాలోచిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు మరో వారం రోజుల్లో సర్దుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కిరణ్ సొంత పార్టీ పెట్టినా అందులో తాను చేరబోనని, కాంగ్రెస్లోనే కొనసాగుతానని మరో మంత్రి సి రామచంద్రయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది కష్టకాలంలో దాన్ని వదిలివెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు. విభజనలో కాంగ్రెస్ పార్టీ తప్పేమీ లేదని, అన్ని పార్టీలూ విభజనకు అనుకూలమని చెప్పిన తరువాతనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లిందన్నారు. చిరంజీవి కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతారన్నారు.
కిరణ్ సొంత పార్టీ పెడితే ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి వారికి సమాధానం చెప్పాల్సిఉందన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగడం పట్ల ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. త్వరలో విభజనలో ప్రతిపక్షాలతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ నాయకులు పోషించిన పాత్ర బహిర్గతమవుతుందని, అప్పుడు అందరి బండారం బయటపడుతుందన్నారు.
లక్షల కోట్ల అవినీతికి పాల్పడిని జగన్ లాంటి వ్యక్తులను కూడా ప్రజలు ఆరాధించడం బాధాకరమని మంత్రి రామచంద్రయ్య తెలిపారు. కాగా ముఖ్యమంత్రిగా విధానపరమైన అంశాలపై చర్చించేందుకు కిరణ్ పిలిస్తే వెళ్తానని, కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కోసమో.. కొత్త పార్టీని స్థాపించేందుకో అయితే తాను సమావేశానికి హాజరుకానని మంత్రి బాలరాజు అన్నారు.
హాజరైన వారు
కాసు వెంకటకృష్ణా రెడ్డి, శత్రుచర్ల విజయ రామరాజు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, పితాని సత్యనారాయణష గంటా శ్రీనివాస రావు, పార్థసారథి, టిజి వెంకటేష్
ఆహ్వానం అందగా గైర్హాజరైన వారు
శైలజానాథ్, తోట నర్సింహం, మహీధర్ రెడ్డి, అహ్మదుల్లా. తాము తమ జిల్లాల్లో ఉండటంతో రాలేకపోతున్నామని వీరు చెప్పారు.
ఆహ్వానం అందని వారు
బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, డొక్కా మాణిక్య వర ప్రసాద్, రామచంద్రయ్య, బాలరాజు, కొండ్రు మురళి, వట్టి వసంత్ కుమార్, గల్లా అరుణ కుమారి