డబ్బులకు అమ్ముడుపోయేవాళ్లం కాదు, వైసీపీలో చేరే ప్రసక్తే లేదు: తేల్చేసిన గల్లా అరుణ
చిత్తూరు: తాను పార్టీ మారే ప్రసక్తే లేదని టీడీపీ నేత, చంద్రగిరి ఇంఛార్జీ గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు.
కుటుంబసబ్యుల్లో ఎవరినైనా పోటీలో పెట్టాలని, కుటుంబ సమస్యగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెప్పానని తెలిపారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయని అన్నారు. తనను ఎవరూ ఆపలేదని, ఒత్తిడి లేదని చెప్పారు.
కార్యకర్తలు అడిగిన పనిచేయలేకపోయానని గల్లా అరుణ కుమారి అన్నారు. బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. డబ్బుల కోసం పార్టీ మారే నైజం తమకు లేదని అన్నారు.
స్వాతంత్ర్యం రాకముందు నుంచే తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని గల్లా అరుణ చెప్పారు. తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమని అన్నారు. చంద్రగిరి ఇంఛార్జీ బాధ్యతలు తీసుకోకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కార్యకర్తలు చెప్పారని తెలిపారు.