నిధులివ్వకపోతే వదిలిపెట్టను, మోడీది కవ్వింపు చర్య, హోదా కోసమే పోరాడండి
అమరావతి: రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే కేంద్రాన్ని వదిలి పెట్టే సమస్యే లేదని... కచ్చితంగా పోరాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నిధులు తెచ్చే వరకు పోరాటం సాగుతుందన్నారు.
మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాని మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజి కాకుండా ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడితే తమ పార్టీ కూడా కలిసి వస్తుందన్నారు.
కేంద్రం న్యాయం చేయాల్సిందే...
5 కోట్ల మంది ఆంధ్రులది ఒకే మాట.. కేంద్రం న్యాయం చేయాల్సిందే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసిన కాంగ్రెస్ను చిత్తుగా ఓడించిన చరిత్ర ఏపీ ప్రజలదని చంద్రబాబు అన్నారు. కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. వాటిని పట్టించుకోనని చెప్పారు. నిధులు తెచ్చే వరకు పోరాడుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పుండుమీద కారం చల్లినట్లు...
బుందేల్ఖండ్ ప్యాకేజీ పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి హోదా లేదని చెప్పి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారని, ప్యాకేజీలను వేరే రాష్ట్రాలకు ప్రకటిస్తున్నారని, దేశంలో ఏపీ కూడా భాగమేనని కేంద్రం గుర్తించాలని అచ్చెన్నాయుడు కోరారు. ఏపీ ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నా కేంద్రంలో చలనం లేదని, కేంద్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? కాదా?
దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా? కాదా? అనే అనుమానం కలుగుతోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధాని మోడీ, బుందేల్ఖండ్కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని, ఏపీ ప్యాకేజీ ఊసే ఆయన ఎత్తడం లేదని విమర్శించారు. మోదీ ప్రకటనతో ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మంత్రి అన్నారు. సమస్యలను రాజకీయ కోణంలోనే చూస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ విషయంలో అన్ని పార్టీలూ సానుకూలమే...
ఏపీ సమస్యలపై జాతీయస్థాయిలో అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నాయని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటేనే అంగీకరించామని, లేకపోతే అంగీకరించేవాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇస్తే ఏపీకీ ఇవ్వాల్సిందేనని, చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే విమర్శలు చేస్తున్నారని, రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా మేల్కోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.
హోదా కోసం పోరాడితే మేమూ కలుస్తాం...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్యాకేజీ నిధుల కోసం పోరాడుతున్నారని, అలా కాకుండా ప్రత్యేక ప్యాకేజి కోసం పోరాడితే తామూ కలిసి వస్తామని సీపీఐ నేత నారాయణ అన్నారు. సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడడం లేదంటూ బుధవారం ఆయన విమర్శించారు.