రిజైన్ చేయనని కనుమూరి: బీజేపీ ఒత్తిడి, బాబుకి చిక్కు
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి చాలా పవిత్రమైనదని, తనకు తానుగా నేను రాజీనామా చేయనని కనుమూరి బాపిరాజు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పదవి చాలా పవిత్రమైనదన్నారు. నేను రాజీనామా చేయనని తెలిపారు. నూతన పాలక మండలి ఏర్పడే వరకు కొనసాగుతానని తెలిపారు. ఇదే విషయాన్ని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు.
బీజేపీ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి
టీడీపీ ప్రభుత్వం కమిటీలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నందున కనుమూరి త్వరలో రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఆయన రాజీనామా చేసేది లేదని చెప్పారు. అయితే, దీని వెనుక లాబీయింగ్ నడుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ పార్లమెంటు సభ్యుడు గోకరాజు రంగరాజుకు కనుమూరి బాపిరాజు బంధువు. ఈ నేపథ్యంలో గోకరాజు ద్వారా కనుమూరి పదవిని కాపాడుకునేందుకు లాబాయింగ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ పైన ఒత్తిడి తెస్తుండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుండి గోకరాజుకు చివరి నిమిషంలో టిక్కెట్ వచ్చింది.
ఇప్పుడు కనుమూరి విషయంలోను బీజేపీ ద్వారా ఆయన తన పట్టు సాధించుకోవచ్చునని అంటున్నారు. బీజేపీ ద్వారా లాబీయింగ్ జరుపుతుండటంతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చాలామంది రేసులో ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కనుమూరికే అవకాశం వస్తే అది చంద్రబాబుకు ఇబ్బందే అంటున్నారు.