రిజైన్ చేస్తే సమైక్యంపై రాసిస్తారా?: పనబాక ఎదురు ప్రశ్న
విజయవాడ: తాను రాజీనామా చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని రాసిస్తే తన వైదొలగేందుకు సిద్ధంగా ఉన్నానని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మంగళవారం అన్నారు. ఆమెను పలువురు సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఆమె స్పందించారు.
తాను రాజీనామా చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని రాసిస్తే సిద్ధమేనన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో తమ పార్టీయే ఉందని, అలాంటప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో లాలూచి అనే అంశానికి తావు లేదన్నారు. అయినా పొత్తుల విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
ప్రస్తుతం విభజనను అడ్డుకోవడమా అడ్డుకోకపోవడమా అనేది ముఖ్యం కాదని రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడటం తమ బాధ్యత అన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే అందుకు తాను సిద్ధమన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.
సీమాంధ్ర పరిస్థితిని తాము అధిష్టానానికి, ఆంటోని కమిటికీ తెలియజేశామన్నారు. న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు సమ్మె అంశంపై మంగళవారం నాలుగున్నర గంటలకు సిఎస్తో ఎపిఎన్జీవోలు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యంపై నమ్మకం కలిగించాలని, అలా అయితే తాము సమ్మె విరమించేందుకు సిద్ధమని సమైక్యా ఉపాధ్యాయ ఐకాస తెలిపింది.