పారిపోవడం తెలియదు, అలా చేస్తే మనతోనే జనం: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి: తనకు జీవితంలో పరిపోవడం తెలియదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు.. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి... జనసేన పార్టీ అది చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీ సర్కారుకు ఆ ఆలోచనే లేదు..
ఒక సమస్య ఉంటే దాని గురించి బలంగా ప్రస్తావించి మాట్లాడితే - వ్యక్తిగత దూషణలకు దిగడం మినహా దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్. తాను కోరుకుంటున్న క్రియాశీలక సభ్యులు ప్రజలు, పార్టీకి అందుబాటులో ఉండేవారై ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ 5 నియోజకవర్గాల్లో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి అమలు చేస్తున్న ప్రమాద భీమా వివరాలను వెల్లడించారు. ఈ సభ్యత్వం పొందినవారికి రూ.5 లక్షలు ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నారు. భీమా ధ్రువపత్రాలను పవన్ కళ్యాణ్ ప్రదానం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
నా జీవితంలో పారిపోవడం తెలియదు..
ఈ సంధర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘నాకు జీవితంలో పారిపోవడం తెలియదు.. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటా. ఏదైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతా. కార్యకర్తల నుంచే నాయకులను తయారు చేసుకోగల సత్తా పార్టీకి ఉంది. క్షేత్రస్థాయిలో నిజాయతీగా పార్టీ జెండా పట్టుకొని పోరాటం చేసే కార్యకర్తలను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. క్రియాశీలక సభ్యత్వంలో కాన్షీరామ్, దళిత ఉద్యమాల నుంచి స్ఫూర్తిని తీసుకున్నాం. పోరాటయాత్రలో భాగంగా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పార్టీ జెండా పట్టుకొని నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలను చూశాను. తోపుడు బండి మీద వ్యాపారం చేస్తూ కూడా తమకు వచ్చిన కొద్దిపాటి ఆదాయంలో కొంత పార్టీ కోసం ఖర్చు చేసే జనసైనికులు తారసపడ్డారు. వారందరికి పార్టీ తరపున అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా 5 నియోజకవర్గాల్లో ప్రారంభించాం. ఈ ఐదు నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొండంత ధైర్యం ఇచ్చారు. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికి ధన్యవాదాలు' అని వ్యాఖ్యానించారు.
అలా చేస్తే మనతోనే జనం: పవన్ కళ్యాణ్
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైనా... ఇవాళ ప్రజలకు సమస్య వస్తే ముందుగా గుర్తొచ్చేది మాత్రం జనసేన పార్టీయే. పరాజయం తర్వాత కూడా ఇంతటి జనాదరణకు కారణం... విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే. ప్రజా సమస్యలపై బాధ్యతతో పోరాటం చేయడమే. కొత్త ప్రభుత్వం గద్దెనెక్కిన మూడు నెలలకే భవన నిర్మాణరంగం కూప్పకూలింది. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన, బాధ చూడలేక వారి తరపున పోరాటం చేస్తానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం విశాఖపట్నంలో నిరసన కవాతు చేపట్టాను. అయితే ఆ రోజు అంతమంది నా వెనుక నడుస్తారని ఊహించలేదు. జనం వస్తే వస్తారు... లేకపోతే నాతో వచ్చిన పదిమందితోనైనా నడిచి నిరసన తెలపాలని అనుకున్నాను. కానీ మన ప్రయత్నం మంచిది కాబట్టి ఆ రోజు ఇసుకేస్తే రాలనంతమంది జనం వచ్చారు. జనం వస్తారని పోరాటం చేయొద్దు. నిజాయితీగా పోరాటం చేస్తే మనతో పాటు జనం నడుస్తారు. మనం నిలబడితే వాళ్లు కూడా నిలబడతారని పవన్ కళ్యాణ్ అన్నారు.
యువతలో ఆవేదన, ఆవేశం మెండుగా ఉన్నా..
రాజకీయ నాయకులు తమ అవసరాలు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారు. అమరావతి విషయంలో అదే జరిగింది. సంక్షేమం పేరుతో సొమ్ములు ఇచ్చినట్టే ఇచ్చి మద్యం, ఇతర మార్గాల ద్వారా పేదలకు ఇచ్చింది లాక్కుంటున్నారు. ఇటువంటి వాటిని ప్రశ్నించడానికి బలమైన సమూహం కావాలి. యువతలో ఆవేశం, ఆవేదన మెండుగా ఉన్నా.. చివరి వరకు పోరాడే ఓపిక అవసరం. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా పోరాటాన్ని ఆపవద్దు. సమస్యలను ఎలా గుర్తించాలి, గుర్తించిన వాటిపై ఎలా పోరాటం చేయాలి, వాటిని లీగల్ గా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై త్వరలోనే ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్.
Recommended Video
2024 ఎన్నికలను బలంగా ఎదుర్కొందాం: పవన్ కళ్యాణ్
గ్రామ స్థాయిలో సమస్యల మీద గళం విప్పాలి అంటే బలమైన సమూహం కావాలి. అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. మేము పెట్టుకున్న లక్ష్యం కంటే ఎక్కువ మంది రావడం చాలా బలాన్ని ఇచ్చింది. జనసేన పార్టీ అంటే ఒక వ్యక్తి మీద అభిమానం, సమాజశ్రేయస్సు కోరుకోనే వ్యక్తుల సమూహం. కార్యకర్తలు అందరూ వ్యక్తిగత అభిమానంతో పనిచేస్తారు. వీరందరిని ఒక గొడుకు కిందకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. సొంత డబ్బు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులు మిగతా పార్టీల్లో చాలా అరుదుగా ఉంటారు. మన పార్టీలో మాత్రం కోకొల్లలుగా ఉన్నారు. 2024 ఎన్నికలను బలంగా ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.