సీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారు
Recommended Video
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎట్టి పరిస్థితుల్లోను ప్రతీకారం తీర్చుకోనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం మొదట ప్రవేశ పెట్టింది తామే అన్నారు.
జగన్కు విజ్జప్తి, చంద్రబాబు వేసిన రోడ్డుకాదు, ఇలా ఇంకెన్ని రోజులు: మురళీమోహన్ కోడలు
ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేశారని, ఉపఎన్నికలు పెట్టాలనుకుంటే ఇప్పుడు కూడా పెట్టవచ్చునని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రయోజనమని, హోదా వల్ల ఇతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని మాట్లాడింది చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు ఆయన డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఇవన్నీ ప్రజలకు తెలుసునని చెప్పారు. వారు గమనిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోను, కానీ
తాను అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబుపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించడం ఖాయమని చెప్పారు. తప్పు చేసిన వారికి మాత్రం కచ్చితంగా శిక్ష పడాలన్నారు. దేవుడి దయ వల్ల ప్రతీకారం తీర్చుకునే గుణం తనకు లేదని, కానీ తప్పు చేసినప్పుడు విచారణ జరపాలన్నారు. అన్ని అంశాలపై విచారణ జరుపుతానని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీది తీవ్రద్రోహమని జగన్ అభిప్రాయపడ్డారు. హోదాపై కాంగ్రెస్ కచ్చితంగా అంటూ చట్టంలో పెట్టలేదన్నారు. ఇప్పుడు అదే మైనస్ అయిందన్నారు. బీజేపీ కూడా ఎన్నికలకు ముందు హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అలాంటప్పుడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలని ప్రశ్నించారు. ఇక టీడీపీ నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉంటి ఇప్పుడు ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందన్నారు. బీజేపీ ఏపీకి చేసినట్లు ఏ రాష్ట్రానికైనా చేసిందా అని ప్రశ్నించింది చంద్రబాబే అన్నారు. ప్రతి పార్టీ మోసం చేసిందన్నారు.
లక్షకోట్లు తిన్నానని ప్రచారం చేసి నమ్మేలా చేశారు, నిరూపిస్తారా
తాను లక్ష కోట్లు తిన్నానని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, వారు నిరూపించగలరా అని జగన్ ప్రశ్నించారు. లక్ష కోట్లు.. లక్షకోట్లు అని పదేపదే చెప్పి నమ్మేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడు కరుణిస్తే, ప్రజలు కోరుకుంటే అధికారంలోకి వస్తానని చెప్పారు. రాజధానిలో ఏమీ చేయలేదన్నారు. హోదా, విభజన హామీల విషయంలో చంద్రబాబు ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారన్నారు. తాను అధికారంలోకి వస్తే అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో అందరికీ తెలుసు
ఏపీకి మోడీ ఏం చేసినా, ప్రత్యేక హోదా ముఖ్యమని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తానంటే తాను బీజేపీ, కాంగ్రెస్.. ఎవరికైనా మద్దతిస్తానని ప్రకటించారు. ఎవ్వరికైనా మద్దతిస్తానని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరన్నారు. న్యాయ వ్యవస్థ సహా చంద్రబాబుకు ఉన్న పరిచయాలు అందరికీ తెలుసునని చెప్పారు. వ్యవస్థలను ఉపయోగించుకొని ఆయన తనకు అనుకూలంగా స్టే తెచ్చుకోవడం లేదా తనకు అనుకూలంగా మలుచుకోవడం చేస్తున్నారన్నారు. శిశుపాలుడికి అయినా వంద తప్పుల వరకు దేవుడు ఓపిక పట్టారన్నారు.
నిన్న పవన్ మాట విన్న వారు నాకూ ఓటేస్తారు
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, మద్దతుదారులు అందరూ టీడీపీకే ఓటేశారని జగన్ చెప్పారు. ఇప్పుడు పవన్ వ్యక్తిగతంగా పోటీ చేస్తున్నారు కాబట్టి, అది మాకు ప్లస్ అన్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో పవన్ మాట విని ఓటు వేసిన వారిలో కొందరు తమకు కూడా వేస్తారని చెప్పారు. కాబట్టి తమ గెలుపు సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీ విభజన హామీల విషయంలో ముగ్గురు కలిసి మోసం చేశారన్నారు. నాలుగేళ్లు మౌనంగా ఉన్న పవన్ ఇప్పుడు టీడీపీకి మద్దతిచ్చాను కాబట్టి నేను కూడా తప్పు చేశానని చెబితే ఎలా అన్నారు.
నా పార్టీలో నేనే సర్వస్వం, సాక్షిలో పెట్టుబడులతో సంతోషం
ప్రాంతీయ పార్టీలో పార్టీ నాయకుడే సర్వస్వం అని జగన్ అన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెనుకా, ముందు తానే ఉండటంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. తాను ఎనిమిదేళ్లుగా రోడ్ల పైన తిరుగుతున్నానని చెప్పారు. తనను చూసే చాలామంది సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. సాక్షిలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ రోజు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతల నుంచి సలహాలు తీసుకోవడం విషయంలో నా అంత గొప్పగా ఎవరూ లేరన్నారు. జగన్ ఎవరి మాట వినడు అనేది తప్పన్నారు. వినాల్సిన విషయంలో అందరి మాట వింటాడన్నారు. తనకు కరెక్ట్ అనిపిస్తే నేను ఎవరి మాటను విననని స్పష్టం చేశారు.