వైఎస్ జగన్ స్ఫూర్తి: భావి ఆంధ్ర నిర్మాణానికి జీతం తీసుకోకుండా ఉద్యోగం: వంశధార ఎస్ఈ సంచలన నిర్ణయం
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. జీతాలకు కూడా తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ విమర్శలు వెలువడ్డాయి. పెట్టుబడుల పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ ప్రయాణాలు, జల వనరుల వంటి వివిధ శాఖల్లో అంచనాలకు మించి చేసిన ఖర్చు దీనికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త ముఖ్యమంత్రి జూన్ నెలలో ఉద్యోగులకు జీతాన్ని కూడా ఇవ్వలేక పోవచ్చంటూ మేథావిగా పేరున్న జయప్రకాశ నారాయణ్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలాన్ని ఇచ్చాయి.
ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు..?జగన్ ఆ నిర్ణయం తీసుకోగలరా.. రాష్ట్ర ప్రజల అయిదేళ్ళ నిరీక్షణ
వైఎస్ జగన్ ఒక్క రూపాయి స్ఫూర్తిగా..
ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతినెలా ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. నిజానికి- ఓ ముఖ్యమంత్రి జీతం నాలుగు లక్షల రూపాయలు. ఆ మొత్తాన్ని వైఎస్ జగన్ వదులుకోనున్నారని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయమే ప్రభుత్వ ఉద్యోగుల్లో స్ఫూర్తినింపినట్టుంది. ఆయన బాటలో పయనించేలా చేస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగులు తమవంతు సాయం చేసేలా ప్రేరేపిస్తోంది. ఆ నిర్ణయం- ఒక్క రూపాయి వేతనం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రతినెలా ఒక్క రూపాయిని మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక దుస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమల్లోకి తీసుకొచ్చేశారు.
అధికారుల్లో స్ఫూర్తి..
వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రభావితులయ్యారు కొందరు ఉన్నతస్థాయి అధికారులు. అసలు జీతమే లేకుండా పనిచేయడానికి ముందుకొచ్చారు నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్. ఆయన పేరు మోపాటి సురేంద్ర రెడ్డి. వంశధార నీటి పారుదల శాఖ ప్రాజెక్టు సూపరింటెండెంట్గా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్నారు. జీతం తీసుకోకుండా ప్రభుత్వానికి సేవలందిస్తానంటూ ప్రకటించారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శనివారం ప్రభుత్వానికి దరఖాస్తును దాఖలు చేశారు.
లక్షా 65 వేల వేతనాన్ని వదులుకోవడానికి సిద్ధం..
ప్రస్తుతం సురేంద్ర రెడ్డికి ప్రతినెలా అందుతోన్న జీతం లక్షా 65 వేల రూపాయలు. దాన్ని వదులుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో తాను ప్రభావితుడినయ్యానని, అసలు జీతమే లేకుండా పనిచేస్తానని ఆయన ప్రకటించారు. సురేంద్ర రెడ్డి స్వతహాగా తాను సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. ఉన్నత చదువులు చదివారు. నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా చేరారు. క్రమంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు ఇంకా రెండేళ్ల సర్వీసు కాలం ఉంది.
అవినీతి లేని ట్రాక్..
అసలే నీటి పారుదల శాఖ. అవినీతి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుందని, భారీగా లంచాలు తీసుకుని ఉంటారని అనుకోవచ్చు. ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. అలా ఎంత మాత్రం ఊహించలేం. జీతాలు, ఉద్యోగాల మీద ఆధారపడాల్సిన అవసరం లేని కుటుంబం సురేంద్ర రెడ్డి కావడం ఒక ఎత్తయితే.. తనకు వచ్చే జీతంలో కనీసం 25 శాతం ఆయన సామాజిక సేవ కోసం ఖర్చు చేస్తుండటం మరో ఎత్తు.
పేద విద్యార్థుల చదువు కోసం..
సురేంద్ర రెడ్డి ప్రతినెలా తనకు వచ్చే జీతంలో నుంచి సుమారు 30 నుంచి 50 వేల రూపాయలను పేద విద్యార్థులపై ఖర్చు చేస్తున్నారు. కొంతమంది పేద విద్యార్థుల ఫీజులను ఆయనే చెల్లిస్తున్నారు. వారి చదువుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి, వారి ఉన్నత విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును భరిస్తున్నారు. తాను చదివించిన పేద విద్యార్థుల్లో చాలామంది జీవితంలో అత్యున్నత శిఖరాలను అందుకున్నారని సురేంద్రరెడ్డి తెలిపారు. చదువుకోవడానికి తాను సాయం చేసిన విద్యార్థుల్లో కొంతమంది విదేశాల్లో కూడా స్థిరపడ్డారని అన్నారు. 24 ఇంజినీర్లుగా, ఎనిమిది మంది డాక్టర్లుగా పని చేస్తున్నారని ఆయన వివరించారు. వారిలో 20 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. తమ పిల్లలకు చదువు చెప్పించలేని స్థితిలో ఉన్న పేద తల్లిదండ్రులకు అండగా ఉన్నానని అన్నారు.
కాగా- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరి దిద్దడానికి వైఎస్ జగన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కాంట్రాక్టర్ల పనితీరుపై కన్నేశారు. వారికి ఇప్పటిదాకా చెల్లించిన బిల్లులను పునఃసమీక్షిస్తున్నారు. ప్రస్తుతం వారికి చెల్లించాల్సిన బిల్లులను నిలిపేశారు. ఇప్పటిదాకా తీసుకున్న బిల్లులపై పునఃసమీక్షించిన తరువాతే చెల్లింపులను మంజూరు చేయనున్నారు.