రాజీనామాకు సిద్ధం: జగన్తో చర్చిస్తానంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు
కడప: ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అంత దౌర్భాగ్యం పట్టలేదు..
బీజేపీతో కలిసే అంత దౌర్భాగ్యం వైసీపీకి పట్టలేదని అన్నారు. తమ వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదని డిప్యటీ సీఎం అంజాద్ బాషా తేల్చి చెప్పారు. 151 సీట్లు గెలిచిన తాము.. ఎన్డీఏలో ఎందుకు కలుస్తామని ప్రశ్నించారు. బీజేపీతో భవిష్యత్తులో కూడా కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. బీసీలు, మైనార్టీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ తమదని అంజాద్ బాషా చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ..
ఎవరో కొందరు తమ మనుగడ కోసం బీజేపీతో కలుస్తున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. మొన్ననే కొత్తగా పార్టీ పెట్టి, ఆ పార్టీని నడిపించలేక.. తను కూడా గెలవలేనివాడు బీజేపీతో జతకట్టాడంటూ పరోక్షంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
రాజీనామాకు సిద్ధం.. జగన్తో చర్చిస్తా..
అంతేగాక, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. తనకు పదవులు కాదు.. నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్దమేనని అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సీఏఏపై వైఎస్ జగన్ వైఖరి ఇలా..
కాగా, పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఏపీలో సీఏఏ అమలుపర్చేందుకు ఎలాంటి వ్యతిరేకతా చూపని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్ఆర్సీని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తమ రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయబోమని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.