స్వామి ప్రబోధానంద వీడియోలు బయటపెడతా:ఎంపీ జేసీ;సిఎం చంద్రబాబుతో భేటీ
Recommended Video
అమరావతి:నిన్నటి వరకు తాడిపత్రి వద్ద దీక్షతో హల్ చల్ చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం అనూహ్యంగా ఎపీ అసెంబ్లీ సమావేశాల వద్ద ప్రత్యక్షమయ్యారు.
అక్కడ సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమై సుమారు అరగంటపాటు పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు ఎక్కువ సమయం చర్చించినట్లు తెలిసింది. అనంతరం అసెంబ్లీ లాబీల్లో తాడిపత్రి పరిణామాల గురించి తనను ప్రశ్నించిన విలేకరులకు సమాధానాలు చెప్పారు.
తాను ప్రబోధానంద స్వామిజీకి చెందిన కొన్ని వీడియోలను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఇక స్వామిజీ వివాదం విషయంలో తాను గెలిచానో ఓడానో తేల్చాల్సింది మీడియానేనని ఎంపి జెసి వ్యాఖ్యానించారు. స్వామిజీకి తాను సాష్టాంగపడ్డానని కొందరు చేసిన ఆరోపణలను కూడా ఎంపి జెసీనే ప్రస్తావనకు తీసుకొచ్చారు.
ప్రబోధానంద స్వామిజీతో పెట్టుకుంటే తమ తమ నియోజకవర్గాల్లో ఇబ్బందులుంటాయని కామెంట్లు చేసే వారిలో గెలిచే వారెవ్వరూ లేరని జేసీ తేల్చేశారు. అసలు అన్ని పార్టీలకు, కులమతాలకు అతీతంగా ప్రబోధానంద స్వామి బాధితులు ఉన్నారని జేసీ చెప్పుకొచ్చారు.
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు సోమవారం సాయంత్రానికి అదుపులోకి వచ్చాయి. స్వామి ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి తాడిపత్రి పోలీసు స్టేషన్ వద్ద దీక్ష చేస్తున్న ఎంపీ జెసి దివాకర్రెడ్డికి సిఎం చంద్రబాబు ఫోన్ చేసి సమస్య పరిష్కారం పై హామీ ఇచ్చారు. ఆ క్రమంలో ఆశ్రమంలోని భక్తులను అధికారులు వారి స్వగ్రామాలకు తరలించి ఆశ్రమం ఖాళీచేయించడంతో ఎంపి జెసి దీక్షను విరమించారు. ఈ నేపథ్యంలో ఎంపి జెసి నేడు సిఎంవోలో ముఖ్యమంత్రిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.