ఆది ఎఫెక్ట్: రామసుబ్బారెడ్డి అసంతృప్తికి కారణమిదే, త్వరలోనే ఎమ్మెల్సీ పదవి
పార్టీలోకి కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలో విలువే లేకుండా పోయింది. మా సహనానికి కూడ హద్దు ఉంటుంది.
కడప: పార్టీలోకి కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలో విలువే లేకుండా పోయింది. మా సహనానికి కూడ హద్దు ఉంటుంది. పార్టీలో మా ప్రాధాన్యత లేకుండా చేశారని మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి ఏపీ సిఎ చంద్రబాబునాయుడు వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశారంటున్నారు.ఇదే పరిస్థితి ఉంటే పార్టీలో కొనసాగే పరిస్థితి ఉంటుందా అంటూ రామసుబ్బారెడ్డి తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి కుటుంబానికి, మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబానికి మధ్య ఏళ్ళ నుండి ఫ్యాక్షన్ గొడవలున్నాయి.ఆదినారాయణరెడ్డి కుటుంబబం కాంగ్రెస్, వైసీపీల నుండి టిడిపిలో చేరింది.
ఆది ఎఫెక్ట్, అసంతృప్తి: చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
రామసుబ్బారెడ్డి మొదటి నుండి టిడిపిలోనే కొనసాగుతున్నారు. అయితే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు తీవ్రంగా హెచ్చరించారు. అయితే రామసుబ్బారెడ్డికి పార్టీలో ప్రాధాన్యతను తగ్గించబోమని పార్టీ నాయకత్వం హమీ ఇచ్చింది.కానీ, ఆచరణలో అందుకు విరుద్దంగా సాగుతోందని రామసుబ్బారెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
అయితే పార్టీ మహనాడుకు రామసుబ్బారెడ్డి వర్గీయులు దూరంగా ఉన్నారు.అయితే ఆయన పార్టీ మారుతారనే ఊహగాహనాలు కూడ వచ్చాయి.అయితే తాను పార్టీ మారడం లేదని రామసుబ్బారెడ్డి ప్రకటించారు.అయితే తాజాగా ఏపీ సిఎం చంద్రబాబునాయుడును కలిసి తన అభిప్రాయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
రామసుబ్బారెడ్డి అసంతృప్తికి కారణమిదే
పార్టీలోకి ఆదినారాయణరెడ్డిని తీసుకోవడాన్ని తొలుత నుండి వ్యతిరేకించాడు రామసుబ్బారెడ్డి, కానీ, ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొన్నప్పటికీ కూడ పార్టీలో రామసుబ్బారెడ్డికి తగిన ప్రాధాన్యతను కొనసాగిస్తామని పార్టీ నాయకత్వం ప్రకటించింది.అయితే ఈ ప్రాధాన్యతను కొనసాగించకపోవడంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలస్థాయి అధికారులు కూడ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పిన మాటలే వింటూ తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామసుబ్బారెడ్డి వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాను వ్యతిరేకించిన అధికారులు పట్టుబట్టి మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మల మడుగుకు బదిలీ చేయించడం పట్ల రామసుబ్బారెడ్డి మనస్థాపానికి గురయ్యారు.
కమిషనర్ బదిలీపై రామసుబ్బారెడ్డి వర్గీయులకు చెక్
జమ్మలమడుగు మున్సిఫల్ కమిషనర్ గా పనిచేసిన లక్ష్మీరాజ్యం తన మాట వినడం లేదని రామసుబ్బారెడ్డి ఆమెను బదిలీ చేయించారు. ఆ స్థానంలో మధుసూదన్ రెడ్డికి పోస్టింగ్ ఇప్పించారు. అయితే ఆదినారాయణరెడ్డి మంత్రి కాగానే మధుసూదన్ రెడ్డిని బదిలీ చేయించి మళ్ళీ లక్ష్మీరాజ్యానికి పోస్టింగ్ ఇప్పించారు. ఈ పరిణామం రామసుబ్బారెడ్డి కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పించింది. తాము బద్దని బదిలీ చేయించిన కమిషనర్ ను తమతో ఒక్కమాట కూడ చెప్పకుండానే మళ్ళీ జమ్మలమడుగుకు తెప్పించడం వెనుక ఆయన కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తమను అవమానపర్చినట్టేనని రామసుబ్బారెడ్డి వర్గీయులు భావించారు. మున్సిఫల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది.
రామసుబ్బారెడ్డికి .తగ్గిన ప్రాధాన్యత
మండలస్థాయి అధికారులు కూడ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పిన మాటలను వింటున్నారు. కనీసం రామసుబ్బారెడ్డి చెప్పిన మాటను వారు కూడ వినడం లేదనే అభిప్రాయంతో ఆయన వర్గీయులున్నారు. పార్టీ కూడ ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయంతో ఆయన వర్గీయులున్నారు.దీంతో ఆయన మహనాడుకు వెళ్ళకుండా డుమ్మా కొట్టారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడ ఆయన హజరుకావడం లేదు. దీంతో మంత్రి ఆదినారాయణరెడ్డికి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి మద్య సంబంధాలు తెగిపోయాయి.
సమాంతర రాజకీయం
మాజీమంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని టిడిపి పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకొంది. ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారు.శనివారం నాడు రామసుబ్బారెడ్డి, ఆయన పిన్ని లక్ష్మీదేవమ్మ చంద్రబాబుతో సమావేశమయ్యారు. మంత్రి ఆదినారాయణరెడ్డితో నెలకొన్న సమస్యలను బాబుకు వివరించారు రామసుబ్బారెడ్డి. ఈ సమస్యలను పరిష్కరిస్తానని బాబు రామసుబ్బారెడ్డికి హమీ ఇచ్చారు. త్వరలోనే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కితే ఆయన కూడ నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సమాంతరంగా రాజకీయాలను నడిపే పరిస్థితి నెలకొంటుంది.