మేం సిద్ధం, వైసీపీ ఎంపీలు అలా చేయకుంటే కుట్రే: రాజీనామాలపై బాబు, దేశ రాజకీయాల్లో మార్పుకోసం
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా ఆమోదించుకొని ఉప ఎన్నికలకు రావాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సవాల్ చేశారు. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2019 ఎన్నికలకు ఉప ఎన్నికలు రెఫరెండం అన్నారు. ఉప ఎన్నికలు రాకుంటే రాజకీయ కుట్ర చేస్తున్నట్లే అన్నారు.
2019లో కేంద్రంలో బీజేపీ రాదని, ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఏపీలో 54 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు. పోలవరాన్ని బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు అడ్డుకుంటే ప్రజలు క్షమించరని చెప్పారు.
పోలవరం పూర్తి కావాలంటే కేంద్రం సహకరించాలన్నారు. కానీ కేంద్రం సహకరించడం లేదన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఓవైపు టీడీపీ కేంద్రంతో పోరాడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనపై వంచన దీక్ష చేస్తోందన్నారు.