మిస్ ఇండియా కిరీటం నేనే గెలుస్తా:ఎపి పార్టిసిపెంట్ శ్రేయారావు
తిరుమల:జూన్లో జరిగే మిస్ ఇండియా ఫైనల్ పోటీల్లో గెలిచి కిరీటం సాధిస్తానని ఎపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నఅందాల రాణి శ్రేయారావు ధీమా వ్యక్తం చేసింది. శుక్రవారం ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మిస్ ఇండియా సాధించాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని, తిరుమల స్వామి వారి దర్శనం తనకు ఎంతో ప్రశాంత తను ఇచ్చిందన్నారు. తాను మిస్ ఇండియా కిరీటం సాధిస్తాననే నమ్మకం ఉందని ఈ సందర్భంగా శ్రేయారావు చెప్పారు. మిస్ ఇండియా పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 30 మంది ఎంపికయ్యారని, తాను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు.
మే నెలలో...శిక్షణ..
మిస్ ఇండియా పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపిక అయ్యామని, తమకు మిస్ ఇండియా ఫైనల్ కాంపిటేషన్ కోసం మే నెల నుంచి నెల రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 23 వ తేదీన ఫైనల్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
విశాఖలో...అందాల పోటీలు...
విశాఖలో మిస్ ఇండియా ఫైనల్ పోటీ కోసం ఎపి నుంచి పోటీ పడే వారికి ఆడిషన్స్ ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించారు. ఈ ఆడిషన్స్కు రాష్ట్రం నలుమూలల నుంచి యువతులు తరలి వచ్చారు. ఆడిషన్స్ సందర్భంగా అందమైన శరీరాకృతి, ఆకర్షణీయమైన వస్త్రధారణ కలగలిసిన ఆంధ్రా అందాల భామలు హోరెత్తించారు. చివరకు వీరిలో శ్రేయరావు, హర్షిత, కిరణ్మయి మిస్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.
అసలైన ఫైనల్...ముంబైలో
వీరికి ఈ నెల 23వ తేదీన బెంగళూరులో ఫైనల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఫెమీనా మిస్ ఇండియా 2018 ఫైనల్స్ను జూన్ నెలలో ముంబైలో నిర్వహించనున్నారు. ఈ 55 వ మిస్ ఇండియా అందాల పోటీల్లో మొత్తం 30 రాష్ట్రాల నుండి పోటీదారులు మిస్ ఇంబియా కిరీటానికి పోటీ పడుతారు. ఈ పోటీల్లో విజేతకు 2017 టైటిల్ విన్నర్ మనుషి ఛిల్లర్ మిస్ ఇండియా కిరీటం ప్రధానం చేస్తుంది. టైటిల్ విన్నర్ అంతర్జాతీయంగా జరిగే నాలుగు ప్రధాన అందాల పోటీల్లో పాల్గొనడానికి అర్హత లభిస్తుంది.