పార్టీ మారతారంటూ వచ్చిన వార్తలపై గంటా ఏం చెప్పారంటే..
విశాఖపట్నం: రాష్ట్రమంతి గంటా శ్రీనివాసరావు తనపై వస్తోన్న వార్తలకు ఎట్టకేలకు స్పందించారు. త్వరలోనే ఆయన పార్టీ ఫిరాయిస్తారంటూ వస్తోన్న వదంతులను తోసి పుచ్చారు. పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయంటూ చెలరేగుతున్న వదంతులకు పుల్ స్టాప్ పెట్టారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని స్పష్టం చేశారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటానే తప్ప, పార్టీ ఫిరాయించబోనని అన్నారు.
సోమవారం ఉదయం ఆయన విశాఖపట్నం జిల్లా భీమిలిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై క్షుణ్నంగా చర్చించారు. లాభ నష్టాలను బేరీజు వేసుకున్నారు. గంటాకు సన్నిహితులైన ఎంపీ అవంతి శ్రీనివాస్ సహా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన విషయం తెలిసిందే. దీనితో గంటా కూడా సర్దేస్తారని అంచనా వేశారు. కొద్దిరోజులుగా దీనికి సంబంధించిన వార్తలు రోజూ వస్తున్నప్పటికీ.. ఆయన పెద్దగా వాటిని కొట్టి పారేయలేదు. తాజాగా- భీమిలి నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో చర్చించిన తరువాత తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడబోనని అన్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటానే తప్ప టీడీపీని వదిలి, ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలతో చర్చించిన తరువాత తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేయడానికి తనకేమీ ఇబ్బందులు లేవని అన్నారు. తాను పార్టీ మారబోతున్నానంటూ వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవేనని అన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని, తానూ ఏ పార్టీనీ సంప్రదించలేదని చెప్పారు. తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ఆరంభమైందని, అందులోనే కొనసాగుతానని అన్నారు.
గంటా శ్రీనివాస రావు ఆప్తమిత్రులైన అవంతి శ్రీనివాస రావు ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావులు జనసేనలో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తన తోటి ఎమ్మెల్యే పంచకట్ల రమేష్ బాబుతో కలిసి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం ఉంది. తాజాగా ఆయన దీనిని కొట్టి పారేశారు. పలు పార్టీలను ఫిరాయించారనే అపవాదు గంటాపై ఉంది.
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ కేరీర్ ను ఆరంభించారు. అనంతరం చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తరువాత కాంగ్రెస్ లోనే కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ సొంత గూటికే చేరుకున్నారు. భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు.