విశాఖ ఛాతీ, గీతం ఆసుపత్రులకు అరుదైన గౌరవం: పూల వర్షాన్ని కురిపించిన వైమానిక దళ హెలికాప్టర్లు
విశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపిస్తోంది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం, చండీగఢ్లోని పంచ్కుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆరంభమైన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
Recommended Video
ఇందులో భాగంగా విశాఖపట్నంలోని ఛాతీ, గీతం ఆసుప్రతులపై వైమానిక దళ జవాన్లు పూల వర్షాన్ని కురిపించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న తూర్పు నౌక దళం అధికారులు ఈ ఉదయం 10 గంటల సమయంలో హెలికాప్టర్ల ద్వారా పెద వాల్తేరు ప్రాంతంలో ఉన్న విశాఖ టీబీ, ఛెస్ట్ ఆసుపత్రి గగనతలం మీదికి చేరుకుని, పూల వర్షాన్ని కురిపించారు. దీనికోసం అధికారులు యుద్ధ విమానాలను వినియోగించారు. సుఖోయ్ - 30, మిగ్ - 29 వంటి యుద్ధ విమానాలు, చాపర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించారు.
ఈ రెండు ఆసుపత్రుల్లోనూ పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పేషెంట్లు చికిత్సను తీసుకుంటున్నారు. విశాఖపట్నంతో పాటు పొరుగునే ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు కోవిడ-19 పేషెంట్లు రుషికొండలో ఉన్న గీతం ఆసుపత్రి, పెద వాల్తేరు ప్రాంతంలోని టీబీ, ఛెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి కోసం ఈ రెండు చోట్ల ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా బారిన పడిన పేషెంట్లకు చికిత్సను అందించడానికి డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి శ్రమకు గుర్తుగా భారత వైమానిక దళం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రులపై పూల వర్షాన్ని కురిపించే కార్యక్రమానికి చేపట్టాయి త్రివిధ దళాలు. తూర్పు నౌకాదళ అధికారులు ఈ సాయంత్రం ప్రత్యేకంగా మరో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. యుద్ధ నౌకల ద్వారా ఫ్రంట్లైన్ వారియర్లను గౌరవించే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామకృష్ణా బీచ్ తీరం సమీపంలో దీన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం శనివారం రాత్రే రిహార్సల్స్ను పూర్తి చేశాయి.