సుదీర్ఘ పోరాటానికి నేను సిద్దం.. ఆ చానెళ్లను బహిష్కరించండి: పవన్ కల్యాణ్ పిలుపు
హైదరాబాద్: శ్రీరెడ్డి మొదలుపెట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుని.. ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందో తెలియని ఉత్కంఠను తెచ్చిపెట్టింది. ప్రస్తుతానికైతే పవన్ కల్యాణ్ అనే మలుపు దగ్గర దీనిపై హైడ్రామా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి వరుస ట్విట్లతో సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాను టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్.. ఫిలిం ఛాంబర్ వద్దకు రావడంతో హీట్ మరింత పెరిగింది.
ఆయనకు మద్దతుగా మెగా కుటుంమంతా అక్కడికి రావడం.. వందలాది మంది అభిమానులు అక్కడ గుమిగూడటం.. అసలేం జరుగుతోందన్న ఉత్కంఠను రేకెత్తించింది. మొత్తంగా.. ఈరోజుకైతే పవన్ నుంచి నేరుగా ఎటువంటి కామెంట్స్ రాలేదు, కార్యాచరణ కూడా ప్రకటించబడలేదు. కానీ ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పవన్ మళ్లీ వరుస ట్వీట్స్ చేస్తూ హీట్ పెంచుతున్నారు.
మహేష్ బాబు సినిమా కలెక్షన్ల కోసమని అనగలను, అవి వింటే మూర్చపోతారు: పవన్కు వర్మ
కుట్ర జరిగిందా?:
తన తల్లి అసభ్య పదజాలంతో దూషించడం.. దానిపై మీడియా చానెళ్లలో గంటల తరబడి చర్చలు పెట్టడం వెనుక ఎల్లో మీడియా ఉన్నదని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ డైరెక్షన్ లో రూ.10కోట్లు ఖర్చు పెట్టి మరీ తన మీద పెద్ద కుట్రకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీంతో ఏంటా పెద్ద కుట్ర? అన్న అనుమానాలు ప్రతీ ఒక్కరికి కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పై కుట్రకు సంబంధించి పలు ఆసక్తికర ఊహాగానాలు షికారు చేస్తున్నాయి.
ఆ చానెళ్లను బహిష్కరించండి..
ఫిలిం చాంబర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పవన్ మళ్లీ వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. టీవి9, టీవి5,ఏబీఎన్ చానెళ్లను బాయ్ కాట్ చేయమని ట్విట్టర్ ద్వారా ఆయన పిలుపునిచ్చారు. మన తల్లులు, అక్కాచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నందుకు.. నగ్నత్వాన్ని, అశ్లీలతను బిజినెస్ గా మార్చుకుంటున్నందుకు, ఒక నిస్సహాయురాలైన సోదరిని పట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నందుకు ఆ చానెళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
సుదీర్ఘ పోరాటానికి సిద్దం..
మరో ట్వీట్ ద్వారా జనసైనికులు సంయమనం పాటించాల్సిందిగా చెప్పారు పవన్ కల్యాణ్. జనసైనికులెవరూ ఎటువంటి హింసాత్మక కార్యాకలాపాలకు పాల్పడరాదని ఆయన సూచించారు. తనపై పరువు నష్టం దావా వేసేందుకు టీవి9 శ్రీనిరాజు రేపటి నుంచి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారని, కానీ మీరంతా నిగ్రహంతో వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. సదరు చానెళ్ల అధినేతలతో తాను సుదీర్ఘమైన, శక్తివంతమైన పోరాటానికి సిద్దపడుతున్నానని స్పష్టం చేశారు.
మహాన్యూస్ పై కూడా ఆరోపణలు..
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవి9 రవిప్రకాష్ లపై బహిరంగంగానే ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. మహాన్యూస్ చానెల్ పై కూడా ఆరోపణలు చేశారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బినామీ అయిన ఈ చానెల్ కూడా తనపై కుట్రలో భాగమే అనేది పవన్ లేవనెత్తుతున్న సందేహం. ఇక టీవి9 మెజారిటీ షేర్ హోల్డర్ అయిన శ్రీనిరాజుకు రాంగోపాల్ వర్మకు బంధుత్వం ఉందని.. అందుకే తనపై కుట్రకు వర్మను కూడా ప్రయోగించారని పవన్ ఆరోపిస్తున్నారు.