నిమ్మగడ్డకు తలుపులు మూసేలా: ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీ మోహన్ బాధ్యతల స్వీకరణ
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడానికి ఒక్కో ప్రయత్నం చేస్తోంది. రమేష్కుమార్ను ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసింది. ఒకవంక చట్ట, న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోనే..రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రక్షాళన చేపట్టింది.
Recommended Video
నిమ్మగడ్డ చుట్టూ చక్రబంధం: కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారిణి: రాత్రికి రాత్రి జీవో
బాధ్యతలు స్వీకరించిన వాణీ మోహన్
ఈ ప్రక్షాళనలో తొలి అడుగుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కొత్త కార్యదర్శిని నియమించింది. సీనియర్ ఐఎఎస్ అధికారిణి జీ వాణీమోహన్కు ఈ బాధ్యతలను అప్పగించింది. సహకార శాఖ కమిషనర్గా ఉన్న ఆమెను ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ కిందటి నెల 30వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు వాణీ మోహన్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సమీపంలోని హెచ్ఓడీ భవనంలో గల కార్యాలయంలో ఆమె బాధ్యతలను స్వీకరించారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా..
ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది తన పరిధిలో లేని అంశమని అన్నారు. కమిషనర్ నిర్దేశాలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎప్పుడు ఎన్నికలను నిర్వహించినా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వివాదాస్పద అంశాలపై దృష్టి సారించట్లేదని తేల్చి చెప్పారు.
వివాదాల మయంగా
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ను నియమించడం, అయిదేళ్ల కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకుని రావడం.. చకచకా సాగిపోయినప్పటికీ.. హైకోర్టు జోక్యంతో దీనికి బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలతో మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా పునర్నియమించడానికి లైన్ క్లియర్ అయినట్టేనని భావించారు. హైకోర్టు వెంటనే రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను స్వీకరించాలని హైకోర్టు ఆదేశించకపోవడంతో మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.
స్టే వస్తుందని
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. త్వరలోనే ఇది విచారణకు రానుంది. హైకోర్టులో ఇచ్చిన తీర్పులోని కొన్ని సాంకేతికపరమైన లోపాలు ఉండటం వల్ల స్టే లభిస్తుందని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. స్టే వచ్చేలోగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమితులైన అధికారులను బదిలీ చేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించనుంది.