జగన్ కు ఏపీ ఐఏఎస్ ల బిగ్ థ్యాంక్స్: అందుకేనా?
ఏపీలో మే నెల నుంచి విశాఖ కేంద్రంగా రాజధాని కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఐఏఎస్ అధికారులు అండగా నిలుస్తున్నారు. అమరావతితో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైన, అభివృద్ధి చెందిన నగరమైన విశాఖకు వెళ్లడమే మంచిదని మెజారిటీ ఐఏఎస్ లు భావిస్తున్నారు. అమరావతిలో ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారికి కూడా విశాఖలో నివసించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ఐఏఎస్ అధికారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
అమరావతిలో ప్రభుత్వ పాలన- ఐఏఎస్ లు
2015లో ఏపీ రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన నేపథ్యంలో ఇష్టం లేకపోయినా ఇక్కడి నుంచి పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు మొగ్గు చూపారు. అప్పటి చంద్రబాబు సర్కారు విజయవాడ, గుంటూరు నగరాల మధ్య వారికి సకల సదుపాయాలతో గృహసముదాయాలు కేటాయించినా మెట్రోపాలిటన్ వాతావరణం మాత్రం వారికి కరవైంది. ఓవైపు అమరావతి అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించకపోవడం, విజయవాడ, గుంటూరు నగరాల్లో సైతం మెట్రోపాలిటన్ సంస్కృతి అభివృద్ధి చెందకపోవడం వంటి కారణాలతో ఎప్పుడు శుక్రవారం వస్తుందా హైదరాబాద్ వెళ్లిపోదామా అన్న ఆలోచనల్లోనే ఐఏఎస్ అధికారులు ఉండిపోయారు.
జగన్ రాకతో మారిన వ్యూహం
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై ఐఏఎస్ అధికారుల్లో సదభిప్రాయం ఉండేది కాదు. ప్రభుత్వం మాట వింటూ తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెడుతున్నారని జగన్ కూడా పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్దితుల్లో మార్పు వచ్చింది. ముఖ్యంగా జగన్ అధికారం చేపట్టగానే ఐఏఎస్ అధికారులు విజయవాడలోని పున్నమిఘాట్ లో సమావేశమై ఆయనకు అండగా నిలవాలని తీర్మానించారు. బదులుగా తమ సమస్యలను అన్నీ జగన్ తీర్చేలా వారు డిమాండ్లు పెట్టారు. చివరికి ఇరువురికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో జగన్ ప్రభుత్వం, ఐఏఎస్ లు ముందుకు సాగిపోతున్నారు.
విశాఖ రాజధాని ప్రకటనతో జోష్
గతేడాది డిసెంబర్ 17న మూడు రాజధానుల ప్రకటనకు ముందు సీఎం జగన్ భారీ కసరత్తే చేశారు. రాజధానిగా అమరావతి విషయంలో ఐఏఎస్ అధికారుల కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు జగన్ గుర్తించారు. దీంతో సహజంగానే మెట్రోపాలిటన్ సంస్కృతికి అనుకూలంగా ఉండే జగన్ తనతో పాటు ఐఏఎస్ లు కూడా విశాఖ రాజధానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఐఏఎస్ అధికారులతో అంతర్గతంగా చర్చించిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీంతో ఐఏఎస్ అధికారులు కూడా ఇప్పుడు విశాఖ రాజధాని విషయంలో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Recommended Video
అమరావతి వద్దు- విశాఖే ముద్దు
అంతగా సదుపాయాలు, మాల్స్, మెట్రో కల్చర్ అభివృద్ధి చెందని అమరావతిలో కంటే విశాఖపట్నానికి వెళ్లడమే మంచిదన్న భావన ఐఏఎస్ అధికారుల్లో వ్యక్తమవుతోంది. అమరావతితో పోలిస్తే మెట్రోపాలిటన్ సంస్కృతి ఉండటం, ఉత్తరాది ప్రభావం కూడా ఎక్కువగా ఉండే విశాఖకు వెళితే బావుంటుందన్న భావన వారిలో కనిపిస్తోంది. అలాగే పిల్లల చదువుల విషయంలోనూ అమరావతితో పోలిస్తే మెరుగైన విద్యాసంస్ధలున్న విశాఖే వారికి అనుకూలంగా అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వారంతా విశాఖ రాజధానికి ఎప్పుడెప్పుడు వెళతామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విశాఖలో పర్యటించి వచ్చిన పలువురు ఐఏఎస్ లు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో నివాసాలు, పిల్లల చదువుల కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.