చంద్రబాబుకు జలక్: అర్దరాత్రి ఐఏయస్ల సమావేశం : ఎల్వీకే మద్దతు..!
Recommended Video
ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం వర్సెస్ సీఎస్ అన్నట్లుగా మారిన ఏపి పాలనా వ్యవస్థలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఏపిలో పని చేస్తున్న ఐఏయస్లు అర్దరాత్రి విజయవాడలో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. వారంతా తాము ప్రభుత్వంలో భాగస్వాములమైనా..సీఎస్ లీడర్ షిప్లోనే పని చేయాల్సిన అవసరం ఉంటుందని తేల్చారు. సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంకే తమ మద్దతు ప్రకటించారు.
ఐఏయస్ల కీలక సమావేశం..
ఏపిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి మొదలు పెట్టిన అప్రకటిన యుద్దం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైపు మళ్లింది. ముఖ్యమంత్రి అధికారిక సమీక్షలకు కోడ్ ఉండటంతో హాజరు కావద్దంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి సైతం తన సమీక్షలకు అధికారులను కట్టడి చేయటం పైన ఆగ్రహంతో ఉన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎస్ పైనా..సీఈవో పైనా ముఖ్యమంత్రి తీరును రిటైర్డ్ ఐఏస్లు తప్పు బట్టారు. గవర్నర్కు ఫిర్యాదు చేసారు. ముఖ్యమంత్రి క్షమానణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఇక, ఆ తరువాత ఐఏయస్ అధికారుల సంఘం సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే, కోరం లేక నాటి సమావేశం వాయిదా పడింది. తాజాగా, ఆదివారం అర్దరాత్రి ఐఏయస్లు సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఇప్పుడు క్యాబినెట్ వర్సెస్ అధికారులుగా పరిస్థితి కనిపిస్తోంది.
ఎల్వీకే మద్దతుగా నిలవాలని....
ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పనీఠను తప్పించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యంను నియమించింది. ఆయనను సీఎస్గా నియమించటాన్ని తొలి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బడుతున్నారు. జగన్ కేసుల్లో సహ నిందితుడు అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తాజాగా, ఏ రాష్ట్రంలో అయినా సీఎస్..ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తారని మన రాష్ట్రంలో మాత్రం సీఎస్గా ఉన్న వ్యక్తి ఎన్నికల సంఘం సీఎస్గా ఉన్నారని కామెంట్ చేసారు. ఇదే సమయంలో తాను మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నానని అందులో బిజినెస్ రూల్స్ ధిక్కరించిన అధికారుల గురించి నిర్ణయం తీసుకుంటామనే విధంగా హెచ్చరికలు జారీ చేసారు. దీంతో, ఐఏయస్లు ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా విజయవాడలో ఆదివారం సాయంత్రం సమావేశం కావాలని భావించారు. అయితే, రాత్రికి అధికారులు వారు నిర్ణయించుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ సమావేశం జరిగిందని తెలుస్తోంది.
క్యాబినెట్ వర్సెస్ అధికారులు..
అధికారుల్లో చీలక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఐఏయస్ అధికారులు సమావేశమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో.. ఎన్నికల ఫలితాల పైన ఏమైనా అధికారుల్లో అంచనా ఉందా అనే కోణంలోనూ చర్చ సాగుతోంది. ఇద్దరు మాజీ ఐఏయస్ అధికారులు ఈ సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్నట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినా..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం మేరకే అధికారులు నడుచుకొనే పరిస్థితి కనిపిస్తోంది. మరి..క్యాబినెట్ దీనిని ధిక్కారం కింద భావిస్తుందా..లేక, విషయం మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.