జగన్ టీంలోకి శ్రీలక్ష్మీ: కేసులకు కారణం జగన్ కాదా..ఏం జరుగుతోంది: ఏపీలో అప్పగించే బాధ్యతల
ఐఏయస్ అధికారి శ్రీలక్ష్మి. కొన్నేళ్లుగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. అత్యున్నత ప్రతిభతో అనతి కాలంలో పాలనా పరంగా మంచి పేరు తెచ్చుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా కాలం జైలు శిక్ష అనుభవించారు. ఆరోగ్య పరంగానూ ఇబ్బందులు పడ్డారు. జగన్ కారణంగానే శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే, శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు అభ్యర్దన సమర్పించారు. జగన్ కారణంగానే కేసులు ఎదుర్కొని ఉంఏ..మరోసారి జగన్ వద్ద పని చేయటానికి ఎందుకు వస్తున్నారు. జగన్ ఇప్పుడు తన ప్రభుత్వం లో శ్రీలక్ష్మికి ఇవ్వబోయే బాధ్యతలు ఏంటి..
జగన్ టీంలోకి శ్రీలక్ష్మి...
సుదీర్ఘ కాలం సీబీఐ విచారణ ఎదుర్కొని..జైలు జీవితం గడిపిన ఐఏయస్ అధికారిని శ్రీలక్ష్మీ ఇప్పుడు ఏపీ కొత్త ప్రభుత్వంలో పని చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ కేడర్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్కు రావడం దాదాపు ఖరారైంది. ఆమె ఇప్పటికే జగన్తో మాట్లాడుతూ ఏపీలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీలక్ష్మి అతి చిన్న వయస్సులో సివిల్ సర్వెంట్ అయ్యారు. ఆమె కెరీర్ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. మైనింగ్ కార్యదర్శిగా వైయస్ హయాంలో పని చేసిన శ్రీలక్ష్మి వైయస్ మరణం తరువాత జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కోవటంతో పాటుగా చాలా కాలం జైళ్లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.
జగన్ కారణంగానే జైలుకు వెళ్లారా..
జగన్ కారణంగా అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారని టీడీపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. అయితే, శ్రీలక్ష్మి తో సహా ఆరోపణలు ఎదుర్కొన్న ఆధిత్య నాధ్ దాస్, శామ్యూల్, మన్మోహన్ సింగ్, ఎల్వీ సుబ్రమణ్యం, శ్యాంబాబు వంటి వారందరికీ క్లీన్ చిట్ వచ్చింది. దీంతో..వీరిలో ఇప్పటికే శామ్యూల్ పదవీ విరమణ చేసి జగన్ ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉండనున్నారు. ఇక, ఎల్వీ సుబ్రమణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జగన్ కారణంగానే శ్రీలక్ష్మీ కేసుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడి ఉంటే ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంలో పని చేయాలని ఎందుకు కోరుకుంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి మీద తప్పుడు అభియోగాలు మోపి..కేసులు బనాయించారో వారందరూ ఇప్పుడు తమ అసలు సమర్ధత నిరూపించుకోవటానికి సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు.
సీఎంఓలోకి శ్రీలక్ష్మి...!
ఏపీ నూతన ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలోకి శ్రీలక్ష్మిని తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. జగన్ తాను ఇచ్చిన నవరత్నాల హామీల అమలు బాధ్యత శ్రీలక్ష్మికి అప్పగిస్తారని తెలుస్తోంది. 1995లో చంద్రబాబు సీఎం అయిన తరువాత డ్వాక్రా సంఘాలకు ఏపీలో రూపకల్పన చేసిన శ్రీలక్ష్మీకి తిరిగి..ఇప్పుడు జగన్ నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి, వైయస్సార్ చేయూత, మద్యపాన నిషేధం వంటి పధకాల బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. అదే విధంగా జగన్ తన టీం మొత్తం అనుభవం..సామర్ధ్యం ఉన్న వారితోనే భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఐఏయస్ల ఎంపిక ఎల్వీ సుబ్రమణ్యం..అజయ్ కళ్లాం పరిశీలిస్తుంటే..ఐపీఎస్ల వ్యవహారం సవాంగ్ పర్యవేక్షిస్తున్నారు.